పెద్దతిప్పసముద్రం : స్థానిక బి.కొత్తకోట రోడ్డులోని పెద్దలైన్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందింది. ఈ విషయాన్ని ఎస్ఐ పరమేశ్ నాయక్ అటవీ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వేసవి కారణంగా దాహం తీర్చుకునేందుకు వన్యప్రాణులు అటవీ ప్రాంతం నుంచి బయటికి వచ్చి రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నాయి. ఈ జింక కూడా అలాగే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఫారెస్ట్ అధికారులు మూగజీవాల గొంతు తడిపేందుకు అటవీ ప్రాంతాల్లో నీటి సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రోడ్డు ప్రమాదంలో
విద్యార్థికి తీవ్ర గాయాలు
మదనపల్లెటౌన్: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి తీవ్రంగా గాయపడి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేరాడు. ఘటనపై ఎస్ఐ చిన్నరెడ్డెప్ప తెలిపిన వివరాలు.. చౌడేపల్లె మండలం, సింగిరి గుంటకు చెందిన రైతు చిట్టిబాబు కొడుకు రివి (13) చౌడేపల్లిలో 8వ తరతగతి చదువుతున్నాడు. రవికి జ్వరం వస్తుండడంతో తన తండ్రి వద్ద బైకు తీసుకుని చికిత్స కోసం చౌడేపల్లెకు వచ్చాడు. తిరిగి బైకులో ఇంటికి బయలుదేరాడు. స్కూటర్ మార్గ మద్యంలోని గుడి వద్ద ఏర్పాటు చేసిన స్పీడు బ్రేకర్ పై వెళ్లి అదుపు తప్పి పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న కుటుంబీకులు వెంటనే వచ్చి బాధితున్ని చికిత్సల నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చారు.
పోరుమామిళ్ల పోస్టాఫీసులో చోరీ
పోరుమామిళ్ల : పోరుమామిళ్ల పోస్టాఫీసులో రెండు లక్షలకు పైగా నగదు చోరీకి గురైంది. ఎస్ఐ హనుమంతు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తలుపులు పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు నగదు అపహరించారు. మంగళవారం ఉదయం పోస్టాఫీసు సిబ్బంది తలుపులు తెరచి ఉండటం గమనించి లోపల పరిశీలించారు. నగదు చోరీ జరిగినట్లు వారు గమనించి సమాచారం పోలీసులకు తెలిపారు. వెంటనే ఎస్ఐ హనుమంతు సిబ్బందితో వచ్చి పరిశీలించారు. పోస్టుమాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
టిప్పర్ కింద పడి
వ్యక్తి దుర్మరణం
లింగాల : మండల పరిధి బోనాల గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం టిప్పర్ కింద పడి దస్తగిరి (40) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాలలోకి వెళితే.. బోనాల నుంచి పొలాలకు టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో దస్తగిరి తన టిప్పర్కు మట్టి లోడు పోయించుకునేందుకు టిప్పర్ నుంచి దిగి మట్టిని లోడు చేయిస్తుండగా.. మరో టిప్పర్ రివర్స్లో వచ్చి వెనుక ఉన్న దస్తగిరిపై వెనుక టైర్లు ఎక్కాయి. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. దస్తగిరి స్వగ్రామం వేముల మండలం చింతలజూటూరు. దస్తగిరి మృతదేహాన్ని పులివెందుల ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.


