భవన యజయాని ఆవేదన
మదనపల్లె అర్బన్ : ‘ఏళ్లు గడుస్తున్నా.. హోటల్ అద్దె బకాయిలు చెల్లించకుండా పార్టీని అడ్డుపెట్టుకుని దౌర్జన్యం చేస్తున్నాడు’ అంటూ ఓ భవన యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. స్థానిక ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో భవన యజమాని సుధాకర్రెడ్డి మాట్లాడారు. జనసేన ఏపీఐఐసీ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ కొంత కాలంగా గొల్లపల్లె బైపాస్ రోడ్డులోని తన భవనంలో హోటల్ నిర్వహిస్తున్నాడన్నారు. అగ్రిమెంట్ ప్రకారం నెలనెలా అద్దె చెల్లించాల్సి ఉందన్నారు. అయితే ఆరేళ్లు గడుస్తున్నా.. ఇంత వరకు అద్దె చెల్లించలేదన్నారు. దీంతో బకాయిల మొత్తం రూ.45 లక్షలకు చేరిందన్నారు. అద్దె అడిగిన ప్రతి సారి గొడవ చేస్తూ.. బెదిరిస్తున్నాడని వాపోయాడు. ముఖ్యంగా పార్టీని అడ్డుపెట్టుకుని దౌర్జన్యం చేస్తుండటంతో ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. పైగా న్యాయం కోరుతూ కోర్టును ఆశ్రయించినట్లు వివరించారు.
అప్పు తీసుకుని ఇవ్వడం లేదు
సీటీఎం రోడ్డుకు చెందిన ఆర్టీసీ మహిళా కండెక్టర్ రూప మాట్లాడుతూ మైఫోర్స్ మహేష్ కుటుంబ సభ్యులు తనను మోసం చేశారని వాపోయింది. పదేళ్ల కిందట మహేష్, అతని తల్లి ఆర్టీసీ కండెక్టర్ లక్ష్మీదేవి, సోదరుడు ఉమేష్ తన వద్ద రూ.18 లక్షలు తీసుకున్నారని చెప్పింది. వ్యాపారాల కోసం డబ్బు తీసుకుని అసలు, వడ్డీ చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని వివరించింది. పైగా తన పేరిట ఆస్తి రాసిస్తామని నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. డబ్బు చెల్లింపు, ఆస్తి రాసివ్వకపోగా.. చివరికి చంపుతామనే స్థాయికి దిగజారారంటూ కన్నీటి పర్యంతమైంది. ముఖ్యంగా తల్లీకొడుకుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించింది. సీఎం, డిప్యూటీ సీఎంలతో తనకు సంబంధాలు ఉన్నాయని, తాను తలచుకుంటే నిన్ను అడ్రస్ లేకుండా చేస్తానంటూ మైఫోర్స్ మహేష్ బెదిరిస్తున్నాడని వాపోయింది. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు విన్నవించింది.


