వాల్మీకిపురం: వాల్మీకిపురం పట్టాభిరామాలయంలో మంగళవారం టీటీడీ ఆధ్వర్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాలకు ముందు జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆలయ గర్భగుడి మొదలు పరిసరాలు, రాముడి బ్రహ్మ రథానికి సుగంధ ద్రవ్యాలతో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో మూలవర్లకు అభిషేకం, అర్చన, తోమాలసేవలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఒంటిమిట్ట : ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించినట్లు ఆలయ టీటీడీ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. ఫిబ్రవరి 13 నుంచి మార్చి 17 వరకు స్వామి వారి భక్తులు వేసిన కానుకలను టీటీడీ పరకామణి అధికారులు, సిబ్బంది లెక్కించారు. ఈ లెక్కింపులో స్వామి వారి హుండీ ఆదాయం 7 లక్షల 72 వేల, 502 రూపాయలు వచ్చినట్లు ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ స్పష్టం చేశారు.


