ఉద్యానపంటల సాగు విస్తీర్ణం పెంచాలి
మదనపల్లె రూరల్: అధిక ఆదాయం ఇచ్చే ఉద్యానవన పంటల సాగుపై రైతులను ప్రోత్సహించి, జిల్లాలో సాగు విస్తీర్ణాన్ని పెంచాలని రైతుసేవా కేంద్రాల సిబ్బందిని జిల్లా ఉద్యాన అధికారి ఎస్.ఎస్.వీ.సుభాషిణి ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో 2026–27 సంవత్సరానికి రాయలసీమ, ప్రకాశం జిల్లాల ఉద్యాన పంటల సాగు పెంపుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికపై వర్క్షాప్ నిర్వహించారు. సమావేశంలో మదనపల్లె, వాయల్పాడు, ములకలచెరువు, తంబళ్లపల్లె, పుంగనూరు, చౌడేపల్లె హార్టికల్చర్ ఆఫీసర్స్ పరిధిలోని రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ సహాయకులు, ఎంపీఈఓలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీహెచ్ఓ సుభాషిణి మాట్లాడుతూ అన్నమయ్యజిల్లాలో ప్రస్తుతం 68,952 హెక్టార్లలో ఉద్యానపంటలు సాగవుతున్నాయన్నారు. రాయలసీమ ప్రాజెక్ట్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 25 క్లస్టర్లను గుర్తించామన్నారు. 2026–27 సంవత్సరానికి 19,388 హెక్టార్లలో ఉద్యానపంటల సాగు పెంపుపై కార్యాచరణ ప్రణాళిక వేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్స్ ఈశ్వర్ప్రసాద్రెడ్డి, సంతోషి, వరప్రసాద్, భీమేష్ తదితరులు పాల్గొన్నారు.
పుంగనూరు: ప్రజలకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం తగదని జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ లోకవర్ధన్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్యసేవల వివరాలను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, 104 సర్వీసు సేవలను పరిశీలించారు.వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు.


