రౌద్రాయ.. వీరభద్రాయ..
● వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం
● వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవారికి విశేష పూజలు
● భక్తిశ్రద్ధలతో ధ్వజారోహణం
ధ్వజారోహణం నిర్వహిస్తున్న అర్చకులు, ప్రత్యేక అలంకరణలో వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవారు
రాయచోటి టౌన్ : ‘భద్రకాళీ ప్రియాయ.. రౌద్రాయ.. వీరభద్రాయ నమః’ అంటూ భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. తమను చల్లగా చూడాలని వారు స్వామి, అమ్మవారిని వేడుకున్నారు. రాయచోటిలో శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. తెల్లవారుజామున ఆలయ పాలక మండలి అధ్యక్షుడు తిరుమల మనోజ్కుమార్, ఈవో డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు నర్రావెంకట భాస్కర్ సిద్ధాంతి నేతృత్వంలో ఆయన శిష్యులు (రుత్వికులు), ఆలయ ప్రధాన అర్చకులు యాగశాలలో హోమాలు నిర్వహించారు. ముందుగా మహాగణపతి పూజ నిర్వహించి తరువాత హోమం చేశారు. అక్కడి నుంచి కలశపూజతో స్వామివారికి సమర్పించారు. తరువాత స్వామి, అమ్మవారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. బంగారు ఆభరణాలతోపాటు వెండి కిరీట ధారణతో అందంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
వస్త్రాలు అందజేత
బ్రహ్మోత్సవాల నిర్వాహకుల(అర్చకులు, రుత్వికుల)కు ఆలయ సంప్రదాయం ప్రకారం వస్త్రాలు అందజేశారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఆజ్ఞ పొందుతూ ఆ వస్త్రాలను వారికి అందజేశారు. వాటిని ధరించిన తరువాత పూజలకు సిద్ధమయ్యారు.
కంకణధారణ
స్వామి వారి బ్రహ్మోత్సవాల నిర్వాహకుల(ఆలయ పాలక మండలి సభ్యులు, అధ్యక్షుడు, మహానైవేద్య నిర్వాహకులు, రుత్వికులు, ప్రధాన అర్చకుల)కు కంకణధారణ చేశారు. వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కంకణధారణ చేసిన వారు నియమనిష్టలతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిసే వరకు ఆలయ ప్రాంగణాన్ని విడిచి వెళ్లకూడదని వేదపండితులు వెల్లడించారు.
శైవాచారం ప్రకారం ధ్వజారోహణ
వీరశైవాచారం ప్రకారం కంకణధారణ చేసిన బ్రహ్మోత్సవాల నిర్వాహకులు శైవ ఆగమనం ప్రకారం.. రుత్వికులు శ్రీ వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు నందీశ్వరుడి ద్వారా పరమ శివుడి ఆజ్ఞ కోరుతూ విన్యాసాలు ప్రదర్శించారు. వారితోపాటు కన్నడ భక్తులు, స్థానిక భక్తులు నిర్వహించిన విన్యాసాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం నందీశ్వరుడిని వస్త్రంపై చిత్రీకరించి ధ్వజారోహణ చేశారు. దీంతో శ్రీవీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందజేశారు.
రౌద్రాయ.. వీరభద్రాయ..
రౌద్రాయ.. వీరభద్రాయ..
రౌద్రాయ.. వీరభద్రాయ..


