భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదు
లక్కిరెడ్డిపల్లి : ఈ నెల 18, 19వ తేదీలలో జరగనున్న గంగమ్మ జాతర సందర్భంగా సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించేలా చొరవ చూపాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఆర్డీఓ శ్రీనివాసులు అధికారులకు సూచించారు. శుక్రవారం మండలంలోని గంగమ్మ దేవత ఆలయ ప్రాంగణంలో రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, టీడీపీ నాయకులు లక్ష్మీప్రసాద్రెడ్డి, ఆలయ చైర్మన్ వెంకటేశ్వర్లు, ఈఓ శ్రీనివాసులతో కలిసి మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్ష చేశారు. జాతరకు వచ్చే సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి జాతరను విజయవంతం చేయాలని సూచించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా అదనపు ట్యాంకర్లు ద్వారా సరఫరా చేయాలన్నారు. జాతర జరిగే మూడు రోజులు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ఎక్కడికక్కడ ముందస్తుగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. శానిటేషన్, మరుగుదొడ్లు, స్నానపుగదులు, మహిళా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. లక్షలాది మంది భక్తులు జాతరకు తరలిరానుండటంతో చలువ పందిళ్లు ఏర్పాటు చేసి క్యూలైన్ల వద్ద సౌకర్యాలు కల్పించి తాగునీటి సరఫరా జరిగేలా చూడాలన్నారు. ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులను నడపాలన్నారు. వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. భక్తులకు మంచినీళ్ల ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసేలా దాతలను ప్రోత్సహించాలన్నారు. ఈ ఏడాది వీఐపీ పాసులు రద్దు చేయడంతో రూ. 300లు టికెట్స్ ఏర్పాటు చేయడం, కొంత మేర సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని వారికి సులభతరంగా అమ్మవారి దర్శనాన్ని కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి ఏడాది వలే ఈ ఏడాది కూడా లక్కిరెడ్డిపల్లి జర్నలిస్టులు, రాయచోటి మురళీ, కోచింగ్ సెంటర్, మానవతా స్వచ్ఛంద సేవాసంస్థ గాలివీటి ప్రవీణ్ కుమార్రెడ్డిలతోపాటు దాతల సహకారంతో నీళ్ల ప్యాకెట్లు, మజ్జిగ, నీళ్లబాటిళ్లు పంపిణీ చేసేందుకు ప్రోత్సాహం చూపాలని సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ క్రాంతి కుమార్, టీడీపీ నాయకులు మదన్, మార్కెట్ చైర్మన్ షఫీ నాయక్, ఆలయ పూజారులు చంద్ర, రెడ్డి శేఖర్, గంగయ్య, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గంగమ్మ జాతరకు విస్తృత ఏర్పాట్లు
అధికారులు సమన్వయంతో పని చేయాలి
ఎస్పీ ధీరజ్, ఆర్డీఓ శ్రీనివాసులు


