క్రమశిక్షణే విజయానికి తొలి మెట్టు
– విద్యార్థుల విజయస్ఫూర్తి సదస్సులో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
రాయచోటి : క్రమశిక్షణతో కూడిన విద్యే ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని, సమాజంలో నిజమైన మార్పు విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అభిప్రాయ పడ్డారు. శుక్రవారం రాయచోటి పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ‘విద్యార్థుల విజయ స్ఫూర్తి’ అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. విద్యార్థులు మార్కుల కోసమే కాకుండా జీవితానికి ఉపయోగపడే జ్ఞానం కోసం చదవాలని సూచించారు. ‘రెడీ టూ చేంజ్’ అనే నినాదాన్ని గుర్తు చేస్తూ కాలానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలన్నారు. ముఖ్యంగా ఏఐ వంటి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా తన విద్యా ప్రయాణంలోని అనుభవాలను పంచుకుంటూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు.
మూడు సూత్రాలు:
లెర్నింగ్ : ఎన్ని పుస్తకాలు చదివామన్నది కాదు.. అందులో ఎంత జ్ఞానాన్ని గ్రహించామన్నదే ముఖ్యం
డిటర్మినేషన్ : ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యం వీడకూడదు
డిసిప్లన్ : తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల వినయం, క్రమశిక్షణ కలిగి ఉండటమే అసలై ఆభరణం అన్నారు.
పదో తరగతి విద్యార్థులు : వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ఎస్పీ వారికి స్వయంగా పరీక్ష కిట్లను అందజేశారు. ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పదో తరగతి తర్వాత విద్యార్థులకు ప్రత్యేకంగా కెరీర్ గైడెన్స్ సెషన్ నిర్వహిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
రక్షణపై.. : యువత మాదకద్రవ్యాలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళల రక్షణ కోసం రూపొందించిన ‘శక్తి’ యాప్పై ప్రతి విద్యార్థిని అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, పట్టణ సీఐ బీవీ చలపతి, ట్రాఫిక్ సీఐ ఎస్.కుళాయప్ప, ఎస్ఐలు విష్ణువర్ధన్, జహీర్, పాఠశాల హెడ్మాస్టర్ ఎస్.సైరాబాను, మోటివేషనల్ స్పీకర్ డీజీ రామమూర్తి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.


