ఒంటిమిట్ట : ఇస్రో ఎన్ఐఎస్ఏఆర్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి బుధవారం పంపిన విషయం తెలిసిందే. ఈ మిషన్లో ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరానికి చెందిన అవ్వారు చందన తన వంతు పాత్ర పోషించారు. ఈమె రెండు నెలల క్రితం ఓ పెద్ద ప్రమాదంలో గాయపడి తిరిగి కోలుకుని తన ఉద్యోగ బాధ్యతలను కొనసాగించారు. ఈమె బెంగళూరులోని ఇస్రోలో సైంటిస్టుగా పనిచేస్తున్నారు. ప్రమాదం నుంచి కోలుకున్న కొన్ని రోజులకే ఆమె మరలా దేశం గర్వించే ప్రయోగంలో పాలుపంచుకోవడాన్ని చూసిన గ్రామస్తులు చందనను పడిలేచిన కెరటంలా అభివర్ణిస్తూ అభినందిస్తున్నారు.
ద్విచక్రవాహనాల చోరీ
కలకడ : ద్విచక్రవాహనాల చోరీపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కలకడ ప్రభుత్వ ఆసుపత్రి దారిలో నివాసం ఉన్న బాబుహుస్సేన్కు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్, మండలంలోని బాలయ్యగారిపల్లె పంచాయతీ యర్రయ్యగారిపల్లెకు చెందిన సయ్యద్ అహమ్మద్కు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్రవాహనాలను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ద్విచక్రవాహనదారులు గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
యోగా పోటీల్లో వైఎస్సార్ కడపకు ఓవరాల్ చాంపియన్ షిప్ టైటిల్
యడ్లపాడు : చిలకలూరిపేట మండలం మద్దిరాలలోని పీఎంశ్రీ జవహర్ నవోదయ పాఠశాలలో జవహర్ నవోదయ విద్యాలయాల పరిధిలో నిర్వహిస్తున్న ప్రాంతీయస్థాయి యోగాక్రీడా ప్రదర్శన పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్ షిప్ టైటిల్ను వైఎస్సార్ కడప క్లస్టర్లోని జేఎన్వీ సాధించుకుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలలోని 8 క్లస్టర్ల నుంచి క్లస్టర్ లెవర్ వరకు జరిగిన యోగా పోటీల్లో గెలుపొందిన జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి.
కృష్ణా, వైఎస్సార్ కడప, బీదర్, షిమోగా, తుమ్మకూర్, పట్నంతిట్టా, వైనాడ్, ఖమ్మం ప్రాంతాలకు చెందిన 278 మంది క్రీడాకారులు పాల్గొని ఆసనాలు, ఆర్టీస్టిక్, రిథమిక్ విభాగాల్లో యోగా విన్యాసాలు ప్రదర్శించి తమ కళాత్మక నైపుణ్యాలను చాటారు. ఆయా పోటీల్లో రాష్ట్రానికి చెందిన వైఎస్సార్ కడప క్లస్టర్ జేఎన్వీ ఓవరాల్ ఛాంపియన్ షిప్ను కై వసం చేసుకోగా, కృష్ణా క్లస్టర్ ద్వితీయస్థానంలో నిలిచింది. అన్ని విభాగాల్లో ప్రథమస్థానంలో నిలిచి ఛాంపియన్షిప్గా నిలిచిన వైఎస్సార్ కడప క్లస్టర్ విద్యార్థులను, ద్వితీయస్థానంలో నిలిచిన కృష్ణా క్లస్టర్ విద్యార్థులను పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.రవి షీల్డ్లు, సర్టిఫికెట్లతో సత్కరించారు.
యూనిఫాం వెనక్కు ఇవ్వలేదని.. విద్యార్థినిపై చేయిచేసుకున్న టీచర్
ప్రొద్దుటూరు కల్చరల్ : యూనిఫాం వెనక్కి ఇవ్వలేదని విద్యార్థినిపై టీచర్ చేయిచేసుకున్న సంఘటన ప్రొద్దుటూరు నడింపల్లె మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో గురువారం జరిగింది. దస్తగిరిపేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ముల్లా జుబేరియా ఐదో తరగతి చదువుతోంది. ఈ పాఠశాలలో యూనిఫాం ఇచ్చిన తర్వాత ఆ విద్యార్థిని నడింపల్లె మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో చేరింది. తమ పాఠశాలలో తీసుకున్న యూనిఫాం తిరిగి ఇవ్వాలని దస్తగిరిపేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు షేక్ సబీహా మరొక విద్యార్థితో చెప్పి పంపింది.
యూనిఫాం ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన ఉపాధ్యాయురాలు గురువారం విద్యార్థిని చదువుతున్న పాఠశాలకు వెళ్లి తరగతి గదిలో విద్యార్థిని చెంపపై కొట్టి వెళ్లిపోయింది. దీంతో విద్యార్థిని ఏడవడంతో అది విన్న తరగతి గదిలోని ఉపాధ్యాయురాలు సంపూర్ణ వచ్చి పరిశీలించగా విద్యార్థిని చెంపపై వాతలు కనిపించాయి. దీంతో ప్రధానోపాధ్యాయుడు శంకర్ దృష్టికి విషయం తీసుకెళ్లారు. దీంతో ఆయన ఉపాధ్యాయురాలు సబీహాపై చర్యలు తీసుకోవాలని ఎంఈఓ శోభారాణికి ఫిర్యాదు చేశారు. ఎంఈఓ స్పందిస్తూ శుక్రవారం పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయురాలు షేక్ సబీహాకు షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

చందనకు అభినందన

చందనకు అభినందన