సాక్షి, రంగంపేట: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రంగంపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ భర్త నిర్బంధాన్ని నిరసిస్తూ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. తమ పార్టీకి చెందిన ఎంపీటీసీ భర్త ఎక్కడున్నాడో తెలపాలంటూ స్టేషన్ వద్ద వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు.
ఎంపీటీసీ భర్తని పోలీసులే నిర్బంధించారని వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అయితే అతను తమ వద్ద లేడని, తాము ఎవర్నీ నిర్బంధించలేదని పోలీసులు వాదిస్తున్నారు.

దీనిలో భాగంగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి కాకినాడ రాజమండ్రి ఏడిపి రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు వారితో వాగ్వాదానికి దిగారు. మరోవైపు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పోటీగా రంగంపేట స్టేషన్ వద్ద టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు.




