మాజీ మంత్రి కొల్లుకు చుక్కెదురు

YSRCP Leader Murder Case: Kollu Ravindra Bail Petition Dismissed By District Court - Sakshi

సాక్షి, కృష్ణా: వైఎస్సార్‌సీపీ సీనీయర్‌ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితుడు అయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు జిల్లా కోర్టులో చుక్కెదురైంది. కొల్లు రవీంద్ర బెయిల్‌ పిటిషన్‌ను జిల్లా కోర్టు గురువారం కొట్టేసింది. ఆయన బయటికి వస్తే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. అతనికి బెయిల్‌ ఇవ్వరాదని తేల్చి చెప్పారు. కొల్లు రవీంద్రతో పాటు మిగతా నిందితులకు కూడా కూడా కోర్టు బెయిల్‌ నిరాకరించింది.

గత నెల 29న మచిలీపట్నం చేపల మార్కెట్‌ వద్ద పట్టపగలు వైఎస్సార్‌సీపీ నేత మోకా భాస్కరరావును దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో చింతా నాంచారయ్య (చిన్ని), చింతా నాంచారయ్య (పులి), చింతా నాగమల్లేశ్వరరావు, చింతా వంశీకృష్ణ, పోల రాము, ధనలతో పాటు ఓ మైనర్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో కుట్ర దారునిగా పేర్కొంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఏ–4 నిందితుడిగా అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top