సాక్షి, తిరుపతి: తిరుమల లడ్డూ వ్యవహారంలో సిట్ ఇచ్చిన నివేదికలో ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చేసిన అపచారానికి పరిహారంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హోమం తలపెట్టింది. ఈ హోమం కార్యక్రమంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. భూమన నివాసం వద్దే హోమం కార్యక్రమం జరుగుతోంది.
ఈ సందర్బంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ..‘సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డు ప్రసాదంపై తీవ్రమైన అపనింద మోపారు. మా నాయకుడు వైఎస్ జగన్ను రాజకీయంగా దెబ్బ కొట్టాలని విష ప్రచారానికి దిగారు. హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామిపై రాజకీయ ఆరోపణలు చేశారు. ఆవు కొవ్వుతో లడ్డు ప్రసాదం తయారు చేశారు అని విష ప్రచారం చేశారు.. పంది కొవ్వు, చేప కొవ్వు కలిసింది అని తప్పుడు కూతలు కూశారు. సుప్రీంకోర్టు సీబీఐ నివేదిక ఇచ్చింది జంతువుల కొవ్వు ఎక్కడా కలవలేదని, రాజకీయ ప్రమేయం లేదని చాలా స్పష్టంగా చెప్పింది.
చంద్రబాబు తట్టుకోలేక తన విష పత్రికలు, ఛానెల్స్తో ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు. కోట్లాది మంది హిందు సమాజాన్ని మనోభావాల్ని దెబ్బతీశారు.
వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై వేసిన నిందల కారణంగా శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం చేస్తున్నాం. ఈ హోమం ద్వారా వాళ్ళు వేసిన నింద పోతుందని భావిస్తున్నాం అంటూ వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా.. తిరుమల లడ్డూ సీబీఐ నివేదికతో అడ్డంగా దొరికినా కూడా.. ప్రసాదంపై టీడీపీ పాపపు ప్రచారం ఇంకా ఆగడం లేదు. లడ్డూ, వెంకటేశ్వర స్వామి ఫొటోలను ఏఐతో ఎడిట్లు చేస్తూ.. ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తోంది. దీనికి తోడు.. వైఎస్సార్సీపీ ద్రోహం చేసిందంటూ పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయిస్తోంది.

టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో.. వెంకటేశ్వర స్వామి ఫొటోలను మార్ఫింగ్ చేసిన పోస్టుల కనిపిస్తున్నాయి. శ్రీవారిని అవహేళన చేసేలా క్యారికేచర్ పోస్టులు చేస్తున్నాయి ఈ పార్టీ శ్రేణులు. టీడీపీ తీరుపై వెంకటేశ్వర స్వామి భక్తులు మండిపడుతున్నారు. ప్రసాదంలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యి కలిసిందని ప్రచారం చేశారని.. ఇప్పుడు అలాంటిదేం లేదని తేలినా కూడా దేవుడిని అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


