కూటమి కొత్త ఎత్తుగడ.. చెవిరెడ్డి అక్రమ అరెస్ట్‌ | YSRCP Chevireddy Bhaskar Reddy Arrest Updates | Sakshi
Sakshi News home page

కూటమి కొత్త ఎత్తుగడ.. చెవిరెడ్డి అక్రమ అరెస్ట్‌

Jun 18 2025 8:53 AM | Updated on Jun 18 2025 10:04 AM

YSRCP Chevireddy Bhaskar Reddy Arrest Updates

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై రెడ్‌బుక్‌ కుట్రతో నమోదు చేసిన అక్రమ కేసును వేధింపులకు పాల్పడటమే లక్ష్యంగా కూటమి సర్కార్‌ అరాచకానికి తెగబడుతోంది. అందుకోసం అబద్ధపు వాంగ్మూలా­లు, తప్పుడు సాక్ష్యాలతో భేతాళ కుట్రకు తెరతీసింది. ఆ కుట్రలో తాజాగా చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసింది. అంతటితో ఆగకుండా ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి, మరో నలుగురిపై కేసు నమోదు చేసింది. లుక్‌ అవుట్‌ నోటీసులు ఇచ్చి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేశ్‌ నాయుడులను మంగళవారం బెంగళూరు విమానాశ్రయంలో ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

బెంగళూరులోని న్యాయస్థానంలో హాజరు పరచి, ట్రాన్సిట్‌ వారెంట్‌పై బుధవారం విజయవాడకు తీసుకురానున్నారు. అనంతరం వారిద్దరినీ విజయవాడ న్యాయస్థానంలో హాజరు పరిచే అవకాశం ఉంది. తద్వారా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసేందుకు కొన్ని రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రం బట్టబయలైంది. ఈ అక్రమ కేసులో తాజాగా వెంకటేశ్‌ నాయుడు(ఏ34), బాలాజీ కుమార్‌ యాదవ్‌ (ఏ35), యద్దాల నవీన్‌ (ఏ36), హరీశ్‌ (ఏ37), చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి (ఏ38), చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి (ఏ39)లను నిందితులుగా చేరుస్తూ సిట్‌ విజయవాడ న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. ఏకంగా సుప్రీం ఆదేశాలు, హెచ్చరికలు బేఖాత­రు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వ బేతాళ కుట్ర ఇలా సాగుతోంది.

కోర్టును తప్పుదారి పట్టించే ఎత్తుగడ
ఈ కేసులో మంగళవారం సాయంత్రం వరకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేశ్‌ నాయుడులను సిట్‌ నిందితులుగా చేర్చనేలేదు. కానీ, వారిపై గుట్టుచప్పుడు కాకుండా లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేసింది. నిందితులుగా చేర్చక పోయినా లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేయడం సిట్‌ బరితెగింపే. సొంత కంపెనీ పనిపై చెవిరెడ్డి మంగళవారం ఉదయం కొలంబో వెళ్లి.. తిరిగి బుధవారం సాయంత్రం వచ్చేలా ఫ్లైట్‌ టికెట్లు బుక్‌ చేసుకున్నారు.

ఈ క్రమంలో తన స్నేహితుడితో కలిసి వెళ్లేందుకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్‌ నాయుడులను అక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాతే ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (ఏ38), వెంకటేశ్‌ నాయుడు (ఏ34)తోపాటు మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ సిట్‌ అధికారులు న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు.

అంటే బెంగళూరు విమానాశ్రయంలో వారిని అదుపులోకి తీసుకునే వరకు వారు ఈ కేసులో నిందితులే కారు. అయినా సరే వారిపై లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేసి వారిని అడ్డుకోవ­డం కచ్చితంగా నిబంధనలకు విరుద్ధమే. ఇదిలా ఉండగా, తాను ఎప్పుడు పిలిచినా సిట్‌ విచారణకు రావడా­నికి సిద్ధమని ఇప్పటికే చెవిరెడ్డి పలుమార్లు ప్రకటించారు. తన కోసం చిన్న చిన్న ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దని, వేధించవద్దని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. అయినా ఆయన ఎక్కడికో పారిపోతున్నట్లు సిట్‌ రహస్యంగా లుక్‌ అవుట్‌ నోటీసులిచ్చి అరెస్ట్‌ చేయడం చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement