సాక్షి, వైఎస్సార్ జిల్లా: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. రేపు(మంగళవారం) సాయంత్రం పులివెందులకు వెళ్లనున్నారు. మూడు రోజులు పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ పులివెందులలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం, ఈనెల 25వ తేదీ ఉదయం పులివెందుల నుంచి వైఎస్ జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు.
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు పులివెందులలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మంగళవారం(రేపు) సాయంత్రం పులివెందులకు చేరుకోనున్న వైఎస్ జగన్.. క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలతో సమావేశం కానున్నారు. అనంతరం ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు.
అలాగే, 24వ తేదీన వేముల మండలం భూమయ్యగారిపల్లిలోని లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించనున్నారు. ఈ ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోటిన్నర రూపాయలకు పైగా నిధులు మంజూరు చేసింది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వైఎస్ జగన్ తిరిగి పులివెందుల క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం నుంచి ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, పార్టీ శ్రేణులతో ఆయన మాట్లాడతారు. 25వ తేదీ ఉదయం పులివెందుల నుంచి వైఎస్ జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు.


