45.72 మీటర్ల ఎత్తులో నీటి నిల్వ ఉండాలి | YS Jagan Mohan Reddy Comments On Polavaram Project, Check Out Full Story For More Details | Sakshi
Sakshi News home page

45.72 మీటర్ల ఎత్తులో నీటి నిల్వ ఉండాలి

Jul 17 2025 4:49 AM | Updated on Jul 17 2025 10:03 AM

YS Jagan Mohan Reddy on Polavaram Project

అప్పుడే పోలవరం నుంచి గోదావరి మిగులు జలాల మళ్లింపు సాధ్యం 

పోలవరంలో నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకు కుదించేందుకు చంద్రబాబు అంగీకరించారు 

దీనివల్ల గోదావరి జలాలు కృష్ణాకు తరలించే అవకాశం ఉండదు 

తొలుత 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా పోలవరం పూర్తి చేయాలి.. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి 

లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే రూ.15 వేల కోట్లు సమీకరించి భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ డిమాండ్‌

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేసేలా పూర్తి చేస్తేనే గోదావరి మిగులు జలాలు ఇతర నదీ పరీవాహక ప్రాంతాల(బేసిన్‌)కు మళ్లించడానికి అవకాశం ఉంటుందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య­మంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్టులో నీటి నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించేందుకు సీఎం చంద్రబాబు రాజీపడ్డారని గుర్తు చేశారు. దీని కారణంగా కృష్ణా నదికి గోదావరి జలాలను తరలించే అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. ‘‘గోదావరికి ప్రాణహిత, ఇంద్రావతి ప్రధాన ఉప నదులు. 

ఇప్పటికే ఎగువ రాష్ట్రాలు ప్రాణహిత జలాలను గరిష్ఠ స్థాయిలో వాడుకు­నేలా ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయి. తాజాగా ఇంద్రావతి జలా­లను గరిష్ఠంగా వినియోగించుకోవ­డా­నికి ఛత్తీస్‌గఢ్‌ బోద్‌ఘాట్‌ బహుళార్ధ సాధక ప్రాజెక్టును చేపట్టింది. దీనికి రూ.50 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ నేపథ్యంలో తొలుత పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా పూర్తి చేయాలి’’ అని  రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్‌ జగన్‌ సూచించారు. అందుకు భూ సేకరణ, నిర్వాసి­తులకు పునరావాసం కల్పించడానికి అవసరమైన నిధులు ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించాలని పేర్కొ­న్నారు. 

కేంద్రం అంగీకరించని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే రూ.15 వేల కోట్లను సమీకరించి.. భూ సేకరణ, నిర్వాసితు­లకు పునరా­వాసం కల్పించి పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా పూర్తి చేయాలన్నారు. ప్రాణహిత, ఇంద్రావతికి అడ్డుకట్ట వేస్తే.. పోల­వరంలో మిగులు, వరద జలాల లభ్యత ఏ స్థాయి­లో ఉంటుందన్నది అంచనా వేయా­లన్నారు. మిగులు, వరద జలాల లభ్యత ఉంటుందని తేల్చిన తర్వాత పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టాలని వైఎస్‌ జగన్‌ సూచించారు. నీళ్లు లేకుండా ఆ ప్రాజెక్టును చేపడితే రూ.80 వేల కోట్లు వృథా అవుతాయ­న్నారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని పోల­వరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. 

Advertisement
 
Advertisement
Advertisement