పులివెందుల: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం వైఎస్సార్ జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన పులివెందులకు చేరుకున్నారు.పులివెందులలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న వైఎస్ జగన్కు వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

స్వాగతం పలికిన వారిలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మాజీ మంత్రి అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే కోరుమట్ల శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

హెలిప్యాడ్ వద్ద నాయకులు, శ్రేణులకు అభివాదం చేసిన అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా పులివెందులలోని తన క్యాంప్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. ఈ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన నియోజకవర్గ పరిధిలోని స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో ముఖాముఖి భేటీ కానున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, స్థానిక సమస్యలపై ఈ పర్యటనలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ప్రజల నుంచి వినతుల స్వీకరణ
పులివెందులలోని తన క్యాంప్ కార్యాలయానికి వైఎస్ జగన్ చేరుకున్నారు. ఆయనను కలిసేందుకు ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. క్యాంప్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్లో వైఎస్ జగన్ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. స్థానిక సమస్యలు, వ్యక్తిగత అభ్యర్థనలు, అభివృద్ధి పనులపై ప్రజలు తమ వినతులను సమర్పించారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ, వారి సమస్యలను విని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ హామీ ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.


