
నల్లమలలో వన్యప్రాణులు విలవిల
అడవిలో నీటి చుక్క కరువు.. ఎండిన కుంటలు, వాగులు
నీటి తొట్టెలు నిర్మించినా అరకొర నీరే!
జనావాస ప్రాంతాలకు వస్తున్న వన్యప్రాణులు
చోద్యం చూస్తున్న అటవీ అధికారులు
ఆళ్లగడ్డ: మండే ఎండలతో ప్రజలే దాహంతో అల్లాడుతున్నారు. నల్లమల అడవిలో వన్యప్రాణులదీ ఇదే పరిస్థితి. అటవీ ప్రాంతంలో నీటి నిల్వలు తగ్గడంతో జనావాస ప్రాంతాలకు వస్తూ ప్రాణాలను కోల్పోతున్నాయి. వేసవిలో సాసర్ పిట్లు( నీటి తొట్టెలను) నింపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదు.
నల్లమలలో జంతువులు ఇవీ..
దేశంలోనే అతి పెద్ద అభయారణ్యం నల్లమల. ఇక్కడ ఎన్నో రకాల వన్యప్రాణులు ఉన్నాయి. నంద్యాల జిల్లాలో అటవీ భూభాగం 1.60 లక్షల హెక్టార్లలో ఉంది. గుండ్లబ్రహ్మేశ్వరం, బండిఆత్మకూరు, నంద్యాల, చెలమ, రుద్రవరం, ఆత్మకూరు, బైర్లూటి, నాగలూటి, శ్రీశైలం, వెలుగోడు అటవీ రేంజ్లు ఉన్నాయి. వీటి పరిధిలో 65 బీట్లు, 44 సెక్షన్లు ఉన్నాయి. అడవిలో చిరుతలు, పెద్దపులులు, ఎలుగుబంట్లు ఎక్కువగా ఉన్నాయి.
అలాగే రేసు కుక్కలు, అడవి పిల్లులు, చుక్కల దుప్పులు, అడవి పందులు, కృష్ణ జింకలు, కుందేళ్లు, అడవి గొర్రెలు, నక్కలు కనిపిస్తాయి. బట్టమేక, అడవికోళ్లు, నెమళ్లతో పాటు వందలాది పక్షి జాతులకు నల్లమల ఆవాసం. వర్షాభావం వెంటాడటం, ఎండ తీవ్రత పెరగడంతో కుంటలు, వాగులు ఎండిపోయాయి. జలవనరుల్లో నీటి జాడ కనుమరుగైంది. అడవిలో చాలా చోట్ల తేమ సైతం ఆవిరైంది. ఇదే వన్యప్రాణుల పాలిట శాపమవుతోంది.
సాసర్లు నింపరు!
నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వన్యప్రాణుల దాహం తీర్చేందుకు 450కి పైగా సాసర్ పిట్లు ఏర్పాటు చేశారు. ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు 5 నెలలు నిరంతరం పర్యవేక్షిస్తూ సాసర్ పిట్లలో నీరు నింపాల్సి ఉంది. అయితే ఈ ఏడాది నిధుల కొరతతో చాలాకాలంగా నీరు నింపడంలేదన్నట్లు తెలుస్తోంది.
కొందరు క్షేత్ర స్థాయి అధికారులు అడపాదడపా అక్కడక్కడా దాతల సాయంతో, సొంతంగా ఖర్చు చేసుకొని వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో దప్పిక తీరడంలేదు. అనేక చోట్ల సాసర్ పిట్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. చెత్తాచెదారంతో నిండిపోయి ఉన్నాయి.
ఇలా చేస్తే ఎంతో మేలు..
బండిఆత్మకూరు, చెలమ, రుద్రవరం రేంజ్ పరిధిలో సాసర్ పిట్లకు ప్రతి రోజూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలి. కొన్ని ప్రాంతాల్లో చెలమలను తవ్వి మూగజీవాలకు నీటి సౌకర్యాన్ని అందించాలి. అదేవిధంగా చెక్ డ్యామ్స్ ఏర్పాటు చేసి వాటి వద్ద నీటి నిల్వలను ఉంచాలి. సాసర్ పిట్ల వద్దకు నీటి కోసం వచ్చిన జంతువుల కోసం ఉప్పు ముద్దలను ఏర్పాటు చేయాలి. మూగ జంతువులు ఉప్పు ముద్దను నాకడంతో వడదెబ్బ బారి నుంచి కాపాడుకునే అవకాశం ఉంది.
నీటి కోసం వచ్చి.. ప్రాణాలు విడిచి
అడవిలో నీటి వనరులు ఎండిపోవడం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాసర్ పిట్లలో నీరు నింపకపోవడంతో మూగ జీవాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ సమయంలో వాహనాలు ఢీకొని ప్రాణాలు వదులుతున్నాయి. అలాగే విద్యుదాఘాతానికి గురై, వేటగాళ్ల ఉచ్చులో చిక్కి మృత్యువాత పడుతున్నాయి.
» ఈ మధ్య కాలంలో నీటికోసం వస్తున్న మూగజీవాలను వేటగాళ్లు నీటిలో విషపు గుళికలు వేసి చంపేస్తున్నారు.
» రుద్రవరం, చెలమ అటవీ రేంజ్ల పరిధిలో వేటగాళ్లు పెట్రేగి పోతున్నారు. ఉచ్చులు వేసి వణ్యప్రాణులను వేటాడి వాటి మాంసాన్ని, శరీర భాగాలను విక్రయిస్తున్నారు.
» ఇటీవల పెద్దకంబలూరు సమీపంలో వేటగాళ్లు వేసిన ఉచ్చులో చిక్కుకుని పెద్దపులి మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.
» మూడు నెలల క్రితం అహోబిలం సమీపంలో కారుపై పెద్దపులి దాడి చేసింది. ఆ సమయంలో గాయాలై అడవిలోకి వెళ్లి పోయింది.
» ఈ నెల 6వ తేదీ రుద్రవరంలో ఇద్దరు వ్యక్తులు వన్యప్రాణుల మాంసం విక్రయిస్తుండగా అట వీ అధికారులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
» 2019లో బాచిపల్లె తండా సమీపంలో పెద్దపులి కళేబరం కనిపించింది. అదే సంవత్స రం ఓ పెద్ద పులి మిట్టపల్లె సమీపంలోని ఎర్రచెరువు కాల్వలో మృతి చెంది కనిపించింది.
» గండ్లేరు రిజర్వాయరులో వేర్వేరు సంఘటనల్లో రెండు చిరుత కళేబరాలు కనిపించాయి.
» 2018లో బాచిపల్లె తండా, అహోబిలం మధ్యన రెండు ఎలుగుబంట్ల కళేబరాలు కనిపించాయి.
» ఆళ్లగడ్డ సమీపంలో కృష్ణజింక వేటకు బలైంది.
» రుద్రవరం సమీపంలో ఐదు నెమళ్లు వేటగాళ్ల ఉచ్చుకు బలయ్యాయి.
» గాజులపల్లి – బొగద మధ్య రైలు పట్టాలపై రెండు చిరుత పులులు మృతి చెందాయి.

చర్యలు తీసుకుంటాం
సాసర్ పిట్లలో నీరు నింపుతున్నాం. ఎక్కడైనా నీరు లేదంటే సిబ్బంది చూడక పోవడమో, మరచిపోవడమో ఉంటుంది. వెంటనే నీటిని నింపేలా చర్యలు తీసుకుంటాం. – శ్రీపతి నాయుడు, రుద్రవరం అటవీ రేంజ్ అధికారి
కుంటలు ఎండిపోయాయి
అహోబిలం అటవీ పరిధిలో చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయాయి. వన్యప్రాణులు నీటి కోసం పొలాల్లోకి, గ్రామాల్లోకి వస్తున్నాయి. అవి దాడి చేస్తాయోనని ప్రజలు భయపడుతున్నారు. – నాసారి వెంకటేశ్వర్లు, ఏకలవ్య ఎరుకలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
అందరి బాధ్యత
నల్లమల అభయారణ్యం రాయలసీమకు మాణిక్యం లాంటింది. అందులోని వన్యప్రాణులను కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉంది. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి మూగజీవాల దాహార్తి తీర్చేందుకు ఏర్పాట్లు చేయాలి. – గజ్జల రాఘవేంద్రారెడ్డి, ఎంపీపీ