సర్పంచ్ బరిలో వలంటీర్ సత్యవతి
రాప్తాడు: ఉత్తమ సేవలందిస్తున్న ఓ మహిళా వలంటీర్ను గ్రామస్తులు సర్పంచ్ బరిలో నిలిపారు. వివరాలు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అందులో భాగంగానే డిగ్రీ పూర్తి చేసిన సత్యవతి మండలంలోని ప్రసన్నాయపల్లిలో వలంటీర్ పోస్టుకు ఎంపికైంది. వలంటీర్ ఉద్యోగం రావడంతో సత్యవతి గ్రామంలో నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో ముందుండేది. ప్రభుత్వ పథకాలను సకాలంలో ప్రజలకు చేరవేసేది.
ఆమె సేవలను గుర్తించిన మండల స్థాయి అధికారులు ఉత్తమ మండల వలంటీర్ అవార్డును ప్రకటించారు. గ్రామ వలంటీర్గా ఉన్నప్పుడే సత్యవతి పేదలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో ముందు వరసలో ఉంటుందని గ్రహించిన గ్రామస్తులు ప్రసన్నాయపల్లి పంచాయతీ సర్పంచ్గా బరిలో దింపారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన కూడా గ్రామస్తులు తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.