టీడీపీ నేతల ఒత్తిడితో దౌర్జన్యం..
లాఠీలతో చితకబాదిన హెడ్ కానిస్టేబుల్
మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు
బాధితుడికి ఎంపీ గురుమూర్తి పరామర్శ
సాక్షి టాస్క్ ఫోర్స్: బ్యానర్ చించాడన్న కారణంతో బీసీ వర్గానికి చెందిన యువకుడిని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన చిత్తూరు మండలం బీఎన్ఆర్పేట గ్రామంలో బుధవారం కలకలం రేపింది. టీడీపీ నేతల ఒత్తిడికి తలొగ్గిన ఓ హెడ్ కానిస్టేబుల్ అమానుషంగా వ్యవహరించాడని, లాఠీలతో చితకబాదారని బాధితుడు రాము కన్నీరుమున్నీరవుతున్నాడు. బాధితుడి కథనం ప్రకారం.. చిత్తూరు మండలం బీఎన్ఆర్ పేటలో మంగళవారం గంగజాతర జరిగింది.
టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బ్యానర్లో తన ఫొటో ఉండడం నచ్చక యువకుడు రాము ఆ బ్యానర్ను చించేశాడు. దీంతో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు అతడిని ఎన్ఆర్పేట పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ హెడ్ కానిస్టేబుల్ కిరణ్ లాఠీతో రామును విచక్షణారహితంగా కొట్టాడుత. ఒళ్లంతా రక్తం గడ్డకట్టేలా వాతలు పెట్టడంతో పాటు చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలు చేశారు. స్టేషన్లో ఎస్ఐ లేని సమయంలో ఈ ఘటన జరిగింది. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్గా చెప్పుకుంటున్న ఓ టీడీపీ నేత అనుచరుడు శ్రీను ప్రోద్బలంతోనే తనపై ఈ దాడి జరిగిందని రాము ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
బాధితుడు రామును బంధువులు బుధవారం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, మెరుగైన వైద్యం నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై టూటౌన్ సీఐ నెట్టికంఠయ్య విచారణ చేపట్టారు. బాధితుడు ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి బాధితుడిని ఫోన్లో పరామర్శించి, ఘటనపై ఆరా తీశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయం జరిగేలా పోరాడతామని హామీ ఇచ్చారు.
వీఆర్కు హెడ్ కానిస్టేబుల్
రామును లాఠీతో చితకబాదిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న హెడ్ కానిస్టేబుల్ కిరణ్ను వీఆర్కు పంపినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.వీఆర్కు పంపడం మాత్రమే కాకుండా, ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు, హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


