
ఈనెల 3న పింఛన్ కోసం వస్తుండగా నా భర్త కిడ్నాప్.. ఆపై హత్య
దోషులంతా టీడీపీ వర్గీయులే
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరుడైనందుకే ఈ దారుణం
టీడీపీ గెలిచిన వెంటనే మాపై దాడి చేశారు
భయంతో పోలీస్స్టేషన్కు వెళ్లి రక్షణ కోరాం
వైఎస్సార్సీపీలో ఉన్న మీకు రక్షణ ఎలా కల్పిస్తామన్నారు
దిక్కుతోచకే తెలంగాణకు వెళ్లాం.. మృతుడు హరిశ్చంద్ర భార్య నిర్మల కన్నీటిపర్యంతం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రత్యేకించి పల్నాడు ప్రాంతం రావణ కాష్టంలా రగిలిపోతోంది. నిత్యం దాడులతో అధికార టీడీపీ నేతల అరాచకం అంతా ఇంతా కాదు. ఎప్పుడు.. ఏ ఊళ్లో.. ఎవరి ఇంటి మీద పడి విధ్వంసం సృష్టిస్తారో తెలియని దుస్థితి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడైన పశువేములకు చెందిన హరిశ్చంద్ర ప్రాణ భయంతో అత్తగారి ఊరైన తెలంగాణలోని నల్గొండ జిల్లా కనగల్లో ఉంటూ పింఛన్ తీసుకోవడానికి స్వగ్రామానికి వస్తూ ఈ నెల 3న టీడీపీ వర్గీయుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు.
ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని ఇట్టే తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి రాగానే బాధితుడి ఇంటిపై ఆ పార్టీ శ్రేణులు దాడి చేసి బీభత్సం సృష్టించడం వాస్తవం. వారు పోలీసులను రక్షణ కోరడం వాస్తవం. వైఎస్సార్సీపీలో ఉన్న మీకు రక్షణ ఎలా కల్పిస్తామని పోలీసులు చేతులెత్తేయడం వాస్తవం. ఇదంతా హత్యకు గురైన హరిశ్చంద్ర భార్య నిర్మల, కుమారుడు మురళి స్వయంగా చెబుతుంటే బంధువులు చంపారంటూ టీడీపీ వక్రభాష్యం చెప్పడం దారుణం. చంపిన వారు టీడీపీ వర్గీయులై ఉండి.. బంధువులైనంత మాత్రాన ఈ దారుణంతో టీడీపీకి సంబంధం లేదనడం దుర్మార్గం. అసలు ఏం జరిగిందో బాధితుల మాటల్లోనే తెలుసుకుందాం.

వైఎస్సార్సీపీలో ఉంటున్నామనే హత్య
మేము మొదటి నుంచీ వైఎస్సార్కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నామనే ఉద్దేశంతో గ్రామంలోని టీడీపీకి చెందిన నాలుగు కుటుంబాలు మాపై దాడులు చేశాయి. మాపై అక్రమంగా కేసులు పెట్టారు. జైలుకు కూడా వెళ్లొచ్చాం. ఇక ఇక్కడ ఉంటే బతకలేమని తెలంగాణ ప్రాంతానికి వెళ్లాం. ప్రతి నెలా మా నాన్న పింఛన్ తీసుకోవడానికి వచ్చేటప్పుడు నేను కూడా తోడు వచ్చే వాడిని. ఈ నెలలో నేను రాలేకపోయాను. దీంతో ఒంటరిగా ఉన్న మా నాన్నను టీడీపీ వారు హత్య చేశారు. ఇది ముమ్మాటికీ తెలుగుదేశం పార్టీ చేసిన హత్యే. నాకు కూడా ప్రాణహాని ఉంది. – మురళి, మృతుని కుమారుడు
టీడీపీ వాళ్లే నా భర్తను చంపారు
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన రోజే మా ఇంటిపై దాడికి ప్రయతి్నంచారు. భయపడి అప్పుడే ఊరు విడిచి వెళ్లి కొన్ని రోజులు బయట తల దాచుకున్నాం. తర్వాత గ్రామానికి వచ్చి పంటల సాగు మొదలుపెట్టాం. మరోసారి మా ఇంటిపై టీడీపీ నాయకులు రాత్రి సమయంలో దాడికి పాల్పడ్డారు. భయంతో పోలీస్స్టేషన్ను వెళ్లి రక్షణ కోరాం. వైఎస్సార్సీపీలో ఉన్న మీకు రక్షణ ఎలా కల్పిస్తామని పోలీసులు అన్నారు.
దిక్కుతోచక నా పుట్టిల్లు అయిన తెలంగాణ రాష్ట్రంకు వెళ్లి బతుకుతున్నాం. ఐదు ఎకరాల్లో మిరప పంట, ఎకరంలో వరి పంటను టీడీపీ వారే స్వా«ధీనం చేసుకున్నారు. ఇంట్లోని బంగారు వస్తువులు, నగదు, ఎరువులు, పురుగు మందులు దోచుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అనుచరుడిగా ఉండటం వల్లనే నా భర్తను టీడీపీ నాయకులు దారుణంగా హత్య చేశారు. – నిర్మల, మృతుని భార్య