రూ.25 కోట్ల భూమిలో పాగా.. కోర్‌ క్యాపిటల్‌లో స్కూల్‌ స్థలం కబ్జా | TDP Leaders Occupied Mandadam ZP High School Land | Sakshi
Sakshi News home page

రూ.25 కోట్ల భూమిలో పాగా.. కోర్‌ క్యాపిటల్‌లో స్కూల్‌ స్థలం కబ్జా

Jun 9 2026 5:32 AM | Updated on Jun 9 2026 5:32 AM

TDP Leaders Occupied Mandadam ZP High School Land

వర్షం కురిస్తే పాఠశాల ఆవరణ దుస్థితి ఇలా(ఫైల్‌)

మందడం జెడ్పీ హైస్కూల్‌కు చెందిన ఎకరం స్థలాన్నికబ్జా చేసిన టీడీపీ నేత 

పాఠశాల నుంచి మురుగు బయటకు వెళ్లే దారి లేక విద్యార్థుల అవస్థలు 

సచివాలయానికి కూతవేటు దూరంలో భూ కబ్జాపై పట్టని యంత్రాంగం 

గ్రామస్తులు పలుమార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం 

విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ ఇకనైనా స్పందించాలని డిమాండ్‌

తాడికొండ: గుడి.. బడి అనే తేడా లేకుండా రాష్ట్రంలో పచ్చముఠాలు సాగిస్తున్న భూ దందాలు, దౌర్జన్యాలు, విచ్చలవిడి కబ్జాలకు ఇది మరో నిదర్శనం! రాజధాని ప్రాంతంలో అసైన్డ్, లంక భూముల నుంచి చివరకు పాఠశాలల దాకా ఈ కబ్జాల కాండ విస్తరించింది. విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశ్‌ పరిధిలోని ఓ పాఠశాల స్థలాన్ని స్థానిక మండల టీడీపీ నేత కబ్జా చేయడం గమనార్హం. రాజధాని అమరావతి కోర్‌ క్యాపిటల్‌ ప్రాంతంలో సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న మందడం జెడ్పీ హైస్కూల్‌కు చెందిన అత్యంత విలువైన స్థలంపై కన్నేసిన ఆ టీడీపీ నేత తన ఆ«దీనంలోకి తీసుకున్నాడు. అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకున్న ఆయన దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేసినా బుట్టదాఖలు చేయిస్తున్నారు. 

మురుగు వెళ్లే దారిలేక.. 
మందడం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు పూర్వం దాతలు ఇచి్చన 4.10 ఎకరాలతోపాటు పంచాయతీ తీర్మానం ద్వారా కేటాయించిన ఎకరం పొలంతో కలిపి మొత్తం 5.10 ఎకరాల స్థలం ఉంది. సచివాలయానికి కేవలం అర కిలోమీటరు దూరం లోపే ఉన్న ఈ ప్రాంతంలో ఎకరం రూ.25 కోట్ల వరకు పలుకుతోంది. పాఠశాలకు చెందిన ఎకరం స్థలాన్ని టీడీపీ నేత కబ్జా చేయడంతో మురుగు బయటకు వెళ్లే దారి లేక ఆవరణ చెరువులా మారింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు.  2017–18­లోనూ టీడీపీ నేత కబ్జాలపై ఓ హెచ్‌ఎం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ భూమి జోలికి రానని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ టీడీపీ అధికారంలోకి రాగానే మరోసారి బరి తెగించాడు.  

చినబాబూ.. ఇకనైనా స్పందించండి! 
పాఠశాల స్థలం ఆక్రమణపై గ్రామానికి చెందిన పలువురు సీఆర్‌డీఏ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్‌కు ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మండిపడుతున్నారు. ఎక్కువగా పేద విద్యార్థులు చదువుకునే జడ్పీ హైస్కూల్‌కు చెందిన విలువైన స్థలం కబ్జా వెనుక పెద్దల హస్తంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాము ఫిర్యాదు చేయడం.. అధికార యంత్రాంగం బుట్టదాఖలు చేయడం పరిపాటిగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. సచివాలయానికి పక్కనే ఉన్న పాఠశాల స్థలం కబ్జాపై విద్యాశాఖ  మంత్రి నారా లోకేశ్‌ తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement