‘తల్లికి వందనం’లో ట్విస్ట్‌.. సర్పంచ్‌ల పిల్లలకు కట్‌! | Talliki vandanam payment cut for sarpanchs In AP | Sakshi
Sakshi News home page

‘తల్లికి వందనం’లో ట్విస్ట్‌.. సర్పంచ్‌ల పిల్లలకు కట్‌!

Jun 14 2025 8:10 AM | Updated on Jun 14 2025 9:56 AM

Talliki vandanam payment cut for sarpanchs In AP

రూ.3 వేలు గౌరవ వేతనం పొందుతుండటమే కారణం

13,325 మందిలో సగానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలే

ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకూ ఇదే కష్టం

గత ప్రభుత్వంలో ‘స్థానిక’ నేతలకు అన్ని పథకాలు వర్తింపు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సర్పంచ్‌ల పిల్లలకు తల్లికి వందనం(Talliki vandanam) పథకానికి అర్హత లేదని కూటమి ప్రభుత్వం మొండి చెయ్యి చూపింది. వారు ప్రతి నెలా రూ.3 వేలు గౌరవ వేతనం తీసుకుంటున్నందున, వారిని ఉద్యోగుల కేటగిరీ కింద లెక్కేసి.. వారి పిల్లలను అనర్హుల జాబితాలో చేర్చింది. దీంతో, వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కార్‌ తీరుపై మండిపడుతున్నారు. 

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నేలగొండ గ్రామ సర్పంచి పాటిల్‌ భాగ్యమ్మ భర్త చిన్న రైతు. వీరికి ఇద్దరు పిల్లలు. మొత్తంగా నలుగురు సభ్యుల కుటుంబం. వీరికి తల్లికి వందనం పథకం పొందే అర్హత ఉంది. అయితే, సర్పంచ్‌గా ఆమె ప్రతి నెలా రూ.3 వేలు గౌరవ వేతనం పొందుతున్నారనే కారణంతో ప్రభుత్వం అనర్హుల జాబితాలో పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 13,325 మంది గ్రామ సర్పంచ్‌లతో పాటు 9 వేల మందికి పైగా ఎంపీటీసీ, 660 మంది జెడ్పీటీసీ సభ్యులు, 660 దాకా మండల పరిషత్‌ అధ్యక్షులు ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం ప్రతి నెలా రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు గౌరవ వేతనం చెల్లిస్తోంది. ఈ లెక్కన ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం మేరకు వీరి పిల్లలకు తల్లికి వందనం పథకం వర్తించదు. 

గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇతరత్రా నిబంధనల ప్రకారం అర్హులుగా ఉంటే చాలు.. అన్ని పథకాలకు వీరిని అర్హులుగా పేర్కొంటూ లబ్ధి కలిగించింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వ నిర్ణయంపై స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల సంఘం నేతలు మండిపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించడంతో పాటు అందులో అంతర్గతంగా ఆయా సామాజిక వర్గాల వారీగా 50 శాతం సీట్లను మహిళలకు ఇచ్చారు. వీరంతా మామూలు కుటుంబాల వారు. చాలా మంది ఉపాధి పనులకు సైతం వెళుతున్నారు.

తల్లికి వందనం పేరుతో కూటమి సర్కారు షాకిచ్చింది. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పి అనేక కొర్రీలు పెట్టి లబ్ధిదారులను తగ్గించేసింది. సవాలక్ష నిబంధనలు విధించి.. ఇంకా కోత కోయనుంది. ప్రభుత్వం తల్లికి వందనం కింద ఇచ్చే రూ.13 వేలకు అనేక నిబంధనల ఆంక్షలు పెట్టింది.

వీరందరూ అనర్హులు
ఒక ఇంట్లో ఒకరు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందుతున్నట్లయితే, అదే ఇంట్లో ఇతరులకు తల్లికి వందనం వర్తించదు.
⇒ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉపకార వేతనాలు పొందే వారికీ పథకం రద్దు. 
⇒ కుటుంబానికి బియ్యం కార్డు లేకుంటే పథకం రాదు.
⇒ కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణులకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు మించితే పథకం ఇవ్వరు.
⇒ మాగాణి 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు మించి ఉండరాదు. 
పట్టణాలల్లో 1000 చ.అడుగుల స్థలం ఉన్నా, నాలుగు చక్రాల సొంత వాహనం ఉన్నా పథకం వర్తించదు. 
⇒ ప్రతి కుటుంబానికి ఏడాది విద్యుత్‌ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని నెలకు 300 యూనిట్లు మించి విద్యుత్‌ వినియోగించి ఉంటే పథకం రాదు.
⇒ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌ పొందుతున్న వారు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు వేతనం పొందుతున్న వారికి పథకం రాదు. 
⇒ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ప్రీృమెట్రిక్, పోస్ట్‌ృమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల పరిధిలోకి వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఆ పథకాల కింద ఆయా శాఖలు అందిస్తున్న మొత్తం మినహాయించి, మిగిలిన నగదును మాత్రమే ‘తల్లికి వందనం’ పథకం కింద చెల్లిస్తారు. 
⇒ సచివాలయాల్లో ప్రదర్శించిన లబ్ధిదారుల జాబితాలో ఎవరిపై అయినా ఫిర్యాదులొస్తే పథకాన్ని ఆపేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement