డాక్టర్ దీపిక మృతిపై వీడని చిక్కుముడి
ఎనస్థీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుష్మకు షోకాజ్ నోటీసు
ఆ రోజు నైట్ డ్యూటీలో లేకుండా ఇంటికెళ్లిన వైనం
పీజీలు, సిబ్బంది నుంచి కూపీలాగుతున్న పోలీసులు
పలు అనుమానాలున్నాయంటున్న దీపిక తండ్రి కోదండరామిరెడ్డి
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఎనస్థీషియా పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థి డాక్టర్ దీపిక ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఆ రోజు రాత్రి వి«ధుల్లో ఉండకుండా ఇంటికెళ్లిన ఆ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుష్మకు విభాగాధిపతి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ నెల నాలుగో తేదీ రాత్రి డాక్టర్ బత్తుల దీపిక అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతి చెందడానికి ముందు అసిస్టెంట్ ప్రొఫెసర్ రూమ్లో ఉంది. ఆ రోజు నైట్ డ్యూటీలో ఉండాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సుష్మ ఆ రోజు రాత్రి 8.30 గంటల సమయంలోనే ఇంటికెళ్లిపోయినట్లు విచారణలో నిర్ధారించారు.
దీంతో ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆమె ఇచ్చే సమాధానాన్ని బట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆ రోజు డాక్టర్ సుష్మ ఇంటికెళ్లకుండా ఉండి ఉంటే, పీజీలు ఇద్దరూ ఒకే రూమ్లో ఉండేవారు. డాక్టర్ సుష్మ ఇంటికి వెళ్లడంతో సీనియర్ పీజీ అయిన డాక్టర్ దీపిక ఒక రూమ్లో ఉండగా, మొదటి సంవత్సరం పీజీ ఇంకో రూమ్లో ఉన్నారు. అర్ధరాత్రి 12.45 గంటలకు తనకు వాంతులు వచ్చేలా ఉన్నాయని దీపిక పక్క రూమ్లో ఉన్న జూనియర్ పీజీకి ఫోన్ చేయగా, ఆమె వచ్చి క్యాన్లా పెట్టి ఇంజక్షన్ చేసి.. కేసు తీసుకొచ్చేందుకు క్యాజువాలిటీకి వెళ్లింది. తిరిగి వచ్చేసరికి దీపిక ఆపరేషన్ టేబుల్పై పడి ఉంది.
అంతర్గత కమిటీ విచారణలో ఏం తేలింది?
డాక్టర్ దీపిక మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆమె తండ్రి కోదండరామిరెడ్డి రాష్ట్ర వైద్య శాఖ కార్యదర్శిని కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లా స్థాయి అధికారులను సైతం కలిశారు. ఆస్పత్రిలో ఇప్పటికే ముగ్గురు ప్రొఫెసర్లతో అంతర్గత కమిటీ విచారణ జరిపింది. వీరు ఏం తేల్చారో ఇంకా వెల్లడవ్వలేదు. తాజాగా పోలీసులు పీజీ విద్యార్థులను పిలిచి అసలు ఆ రోజు ఏమి జరిగిందనే విషయంపై కూపీ లాగుతున్నారు.
ఆ రోజు రాత్రి థియేటర్కు ఎవరైనా వచ్చారా..? వస్తే ఎందుకు వచ్చారు..? దీపికను ఎవరైనా వేధించారా..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఒకవేళ ఆత్మహత్యకు పాల్పడి ఉంటే, అందుకు కారణాలేమిటనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఫోన్ కాల్స్ను సమగ్రంగా పరిశీలిస్తే (స్నాప్ షాట్, ఇన్స్టా కాల్స్ సహా) క్లూ దొరికే అవకాశం ఉంటుందని కొందరు వైద్యులు, విద్యార్థులు చెబుతున్నారు. ఆ రోజు ఆమెతో పాటు విధుల్లో ఉన్న సిబ్బంది స్టాఫ్ నర్సు, థియేటర్ అసిస్టెంట్లను కూడా విచారిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు అందితే కొంత వరకు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.


