మనిషి కాలు నోట కరుచుకుని తిరిగిన కుక్క
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో భీతావహ పరిస్థితిపై రాష్ట్ర వ్యాప్త చర్చ
మెడికల్ వ్యర్థాల నిర్వహణ అస్తవ్యస్తంపై ప్రజల ఆందోళన
చంద్రబాబు ప్రభుత్వ అలసత్వ విధానాలపై ఆగ్రహం
లబ్బీపేట (విజయవాడతూర్పు): ప్రతి రంగంలోనూ చంద్రబాబు ప్రభుత్వం అలసత్వ విధానాలు, అసమర్థ పాలనపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రోగి నుంచి తొలగించిన కాలు నోట కరుచుకుని వీధికుక్క గురువారం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో తిరిగిన వైనం తాజాగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.గతంలోనూ పాత ఆస్పత్రిలో మృతశిశువును కుక్కనోటకరుచుకుపోయింది. బయోమెడికల్ వ్యర్థాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలనే నిబంధనలు ప్రభుత్వాసుపత్రుల్లో నిర్విర్యమవుతున్నాయనడానికి తాజా ఘటన అద్దం పడుతోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
గుట్టలుగా వ్యర్థాలు
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వెయ్యికిపైగా పడకలు, మూడు బ్లాకుల్లో ఆపరేషన్ థియేటర్లు ఉండటంతో బయోమెడికల్ వ్యర్థాలు ప్రతిరోజూ గుట్టలుగా వస్తుంటాయి. అన్ని వార్డులు, థియేటర్ల నుంచి బయోమెడికల్ వ్యర్థాలను వర్కర్స్ తీసుకుని వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదుల్లో వాటిని ఉంచుతారు. వీటిని నిర్విర్యం చేసే సంస్థ సిబ్బంది రోజూ ఉదయం 10 గంటలకు ప్రతి 24 గంటలకు ఆసుపత్రికి వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదుల్లో ఉంచిన బయోమెడికల్ వ్యర్థాలను వాహనంలో తీసుకువెళతారు. బయోవ్యర్థాల నిర్వహణలో వైఫల్యమే తాజా ఘటనకు కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చేతులు కాలాక..
ప్రభుత్వాస్పత్రిలో తాజా ఘటనపై తక్షణ చర్యల్లో భాగంగా బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణను చూసే సూపర్వైజర్ను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు సస్పెండ్ చేశారు. ఒక టెక్నీషియన్ను కూడా తొలగించినట్లు తెలిసింది. ప్రాథమిక విచారణ కోసం డిప్యూటీ సూపరింటెండెంట్, న్యూరాలజీ హెచ్ఓడీ డాక్టర్ అరుణ, సీఎస్ ఆర్ఎంఓ డాక్టర్ వై పద్మావతిలతో కూడిన కమిటీని నియమించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ వేమిరెడ్డి రాధికారెడ్డిని ఆదేశించారు.
ఇదేం కొత్తకాదు..
ప్రభుత్వాస్పత్రిలో మానవ అవయవాలను కుక్కలు తినడం వంటి ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. పాత ఆస్పత్రిలో 2016లో మృత శిశువును నోటితో పట్టుకుని ఆస్పత్రి ప్రాంగణంలో తిరగడం అప్పట్లో కలకలం రేపింది. అంతేకాకుండా 2018లో సిద్ధార్థ వైద్య కళాశాల అనాటమీ విభాగంలోని మానవ అవయవాలు సైతం కళాశాల ఎదుట డ్రెయిన్లో కనిపించాయి. ఇలాంటి ఘటనలు బయోమెడికల్ వ్యర్థాల నిర్వాహణాలోపాన్ని ఎత్తి చూపుతున్నాయి.


