
దర్యాప్తు పేరిట సాక్షులు, నిందితులను వేధించొద్దన్న ఆదేశాలు బేఖాతర్
కేసు పెట్టాం కాబట్టి అరెస్టు చేసి తీరాలన్న ఆలోచన సరికాదు
అది పౌరుడి గౌరవ ప్రతిష్టలకు సంబంధించిన వ్యవహారం
రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక
ఇవేమీ పట్టించుకోబోమని చేతల్లో చెబుతున్న సిట్ చీఫ్, ఆయన బృందం
ఎలాంటి ఆధారాలు చూపకుండానే చెవిరెడ్డి అరెస్టే ఇందుకు నిదర్శనం
సాక్షి, అమరావతి: చంద్రబాబు కుట్రలో భాగంగా ఏర్పడిన సిట్ రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిపోతోంది. రెడ్బుక్ కుట్రలో భాగంగా అక్రమ అరెస్ట్లు, దర్యాప్తు ముసుగులో వేధింపులు, చిత్రహింసలకు బరితెగిస్తోంది. సిట్ అరాచకం ఎంతగా సాగుతోందంటే సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు, హెచ్చరికలను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ దాష్టీకానికి పాల్పడుతోంది.
ఇదే అక్రమ కేసులో నిందితులుగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎ.ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ గోవిందప్ప దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తూ సుప్రీంకోర్టు విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు, విచారణ పేరిట ఈ కేసులో సాక్షులు, నిందితులను ఏ విధంగానూ వేధించకూడదని.. వారిని శారీరకంగా హింసించ కూడదని స్పష్టం చేసింది. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని కూడా హెచ్చరించింది.
అంతేకాదు ఆధారాలు లేకుండా అరెస్టు చేయకూడదని పేర్కొంది. కేసు పెట్టాం కాబట్టి అరెస్టు చేసి తీరాలన్న ఆలోచన ఏమాత్రం సరైంది కాదని కూడా విస్పష్టంగా తేల్చి చెప్పింది. అది పౌరుడి గౌరవ ప్రతిష్టలకు సంబంధించిన వ్యవహారమని కూడా వ్యాఖ్యానించింది. అందుకు విరుద్ధంగా రాజకీయ దురుద్దేశాలతో వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని సిట్ అధికారులను సుప్రీంకోర్టు హెచ్చరించింది.
మా పని మాది..
సుప్రీంకోర్టు ఆదేశాలను తామేమాత్రం పట్టించుకోబోమని సిట్ చీఫ్ ఎస్వీ రాజశేఖర్బాబు, ఆయన బృందం తమ చేతల ద్వారా తేల్చి చెప్పారు. ఇప్పటికే ఎంతో మంది సాక్షులను వేధించి, హింసించిన సిట్ అధికారులు తాజాగా తమ పోలీసు శాఖకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లపై ఏకంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి మరీ చిత్రహింసలకు గురి చేయడం విభ్రాంతి కలిగిస్తోంది.
అంతే కాకుండా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అక్రమ అరెస్ట్ వ్యవహారంలో కూడా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించింది. ఆయనకు వ్యతిరేకంగా సిట్ ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు చూపించనే లేదు. ఆయనకు నోటీసు ఇచ్చి విచారణకు పిలవనే లేదు. మంగవారం మధ్యాహ్నం వరకు ఆయన పేరును ఎఫ్ఐఆర్లో కూడా చేర్చనే లేదు. అయినా సరే మంగళవారం ఉదయం ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేసి.. సీఎం చంద్రబాబు కుట్రలకు సిట్ వత్తాసు పలికింది.
కేవలం రాజకీయ దురుద్దేశాలతోనే చెవిరెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా స్పష్టమవుతోంది. అంటే సుప్రీంకోర్టు ఆదేశాలంటే తమకు ఏమాత్రం లెక్కలేదని, ప్రభుత్వ పెద్దల రాజకీయ కుట్రలకు వత్తాసు పలికి.. వేధింపులు, కక్ష సాధింపులకు పాల్పడటమే తమ ఏకైక లక్ష్యమని సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్వీ రాజశేఖర్బాబు, ఆయన బృందం స్పష్టం చేస్తోంది.