ఏసీబీకి పట్టుబడిన తాడేపల్లిగూడెం పట్టణ ఎస్సై నాగరాజు
ప్రేమజంట పెళ్లి వ్యవహారంలో రూ.70 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం
తాడేపల్లిగూడెం అర్బన్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ ఎస్సై పి.నాగరాజు రూ.70 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. తాడేపల్లిగూడెం కడకట్ల ప్రాంతానికి చెందిన ఓ ప్రేమజంట (మేజర్లు) గత నెలలో వివాహం చేసుకునేందుకు ప్రయత్నించగా... యువతి తల్లిదండ్రులు అడ్డుకుని తమ కుమార్తెను మోసగించి పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని పట్టణ పోలీస్ స్టేషన్లో యువకుడిపై ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్సై పి.నాగరాజు యువకుడు అభిలాష్, అతడి తల్లిదండ్రులను ఈ నెల 6న పోలీస్ స్టేషన్కు పిలిపించి అభిలాష్పై రౌడీషీట్ వేయిస్తానని, అత్యాచారం కేసు నమోదు చేస్తానని బెదిరించారు. రూ.2 లక్షలు ఇస్తే అభిలాష్ను వదిలేస్తామని చెప్పగా.. అంత ఇవ్వలేమని రూ.70 వేలు ఇస్తామనడంతో ఎస్సై నాగరాజు అంగీకరించారు.
అనంతరం యువకుడి తల్లి నీలాపు కుమారి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన ట్రాపింగ్ నోట్లు తీసుకుని గురువారం పోలీస్ స్టేషన్లో ఎస్సై నాగరాజుకు రూ.70 వేలు ఇస్తుండగా పక్కన ఉన్న బాలసుబ్రహ్మణ్యం అనే కానిస్టేబుల్కు ఇవ్వమని ఎస్సై చెప్పారు. దీంతో కానిస్టేబుల్ బాలసుబ్రహ్మణ్యం రూ.70 వేలు తీసుకుంటుండగా ఏలూరు నుంచి వచ్చిన ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఎస్సై, కానిస్టేబుల్పై కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్లోనే సెటిల్మెంట్లు పేరుతో భారీగా అక్రమ సొమ్ములు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఎస్సై నాగరాజుతోపాటు ఆయన కుటుంబ సభ్యుల పేరున ఉన్న ఆస్తుల వివరాలపై విచారణ చేస్తున్నట్టు సమాచారం.


