ఉప్పొంగిన ఉద్యోగి! 

Regularization of contract employees - Sakshi

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధికరణ, జీపీఎస్‌పై హర్షాతిరేకాలు 

రాష్ట్రవ్యాప్తంగా ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో ఆనందోత్సాహాలు  

సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకాలు 

సాక్షి, అమరావతి, సాక్షి నెట్‌వర్క్‌:  ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పదవీ విరమణ అనంతరం ఉద్యోగుల విశ్రాంత జీవనానికి పూర్తి భరోసా కల్పిస్తూ జీపీఎస్‌ తేవడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధి కరణ, వైద్య విధాన పరిషత్‌ను ప్రభుత్వంలో విలీనం చేయడం తదితర నిర్ణయాలను కేబినెట్‌ ఆమోదించటాన్ని స్వాగతిస్తున్నారు.

20 ఏళ్ల కల నెరవేరిందని కాంట్రాక్టు ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో సంబరాలు చేసుకున్నారు. వేతనాలు, సెలవుల రెగ్యులరైజేషన్, ఇతర అంశాల్లో జాప్యానికి ఇక తెరపడనుందని పేర్కొంటున్నారు. గొల్లపూడిలోని ఏపీవీవీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం చిత్రపటానికి క్షీరా­భిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో జాయింట్‌ కమిషనర్‌ డాక్టర్‌ పి.సరళమ్మ, వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లి కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌ కుమార్, వైద్య విధాన పరిషత్‌ డాక్టర్ల జేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ రోహిత్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్య శాఖ మంత్రి విడదల రజిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జవహర్‌రెడ్డిని కలిసి యూనియన్‌ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం జగన్‌కి ధన్యవాదాలు తెలియచేస్తూ రాçష్ట్రవ్యాప్తంగా వారం పాటు సంబరాలు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ పూనూరు గౌతంరెడ్డి పిలుపునిచ్చారు.  

దివంగత వైఎస్సార్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌చిత్రపటాలకు విశాఖ కలెక్టరేట్‌ ఎదుట ఎన్జీవోలు, కాంట్రాక్టు ఉద్యోగులు క్షీరాభిషేకం నిర్వహించారు. సీఎం సార్‌ ధన్యవాదాలంటూ కృతజ్ఞతను చాటుకున్నారు. కలెక్టరేట్‌ పరిసర ప్రాంతాల్లో ఉరేగింపు నిర్వహించారు. పీఆర్సీ, బకాయిల చెల్లింపు తదితర నిర్ణయాలపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.ఈశ్వరరావు తెలిపారు. సీఎం జగన్‌ ఉద్యోగుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారని కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.ఎస్‌.చలం పేర్కొన్నారు. విశాఖ కలెక్టరేట్‌లోని ఎన్జీవో హోమ్‌లో మెడికల్‌  కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ముఖ్యమంత్రి జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.  

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా భట్లవెల్లిలో సీఎం జగన్‌ చిత్రపటానికి వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. ఇందులో మంత్రి విశ్వరూప్‌ పాల్గొన్నారు.  

తెనాలిలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీఎం జగన్‌ ప్రభుత్వానికి మద్దతుగా ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. వైద్యవిధాన పరిషత్‌ ఉద్యోగులకు 010 పద్దు ద్వారా జీతా­లివ్వాలని నిర్ణయించటం సంతోషకరమన్నారు.  

చిత్తూరులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట, తిరుపతి రుయా ఆసుపత్రి ఆవరణలో సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరా­భి­షేకం చేశారు. సూళ్లూరుపేటలో ప్రభుత్వ జూని­­­యర్‌ కళాశాల కాంట్రాక్ట్‌ అధ్యాపకులు సీఎం చిత్రపటానికి క్షీభిషేకం నిర్వహించారు. 

​​​​​​​♦  ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నెల్లూరు జిల్లా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న 115 మంది కాంట్రాక్టు అధ్యాపకులు రెగ్యులరైజ్‌ కానున్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డితో కలసి నగరంలోని కేఏసీ జూనియర్‌ కళాశాల ఎదుట సీఎం జగన్‌ చిత్రపటానికి  పాలాభిషేకం చేశారు. కేక్‌ కట్‌ చేసి  సంబరాలు నిర్వహించారు. 

​​​​​​​♦ ముఖ్యమంత్రి జగన్‌ చేసిన మేలును జన్మలో మరువలేమని రాష్ట్ర కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం ప్రతినిధులు ఎస్‌.దొరబాబు, వేణుగోపాలరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు చాటుకున్నారు. కాంట్రాక్ట్‌ వ్యవస్థను తీసుకొచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమను పట్టించుకోకపోగా జీతాలు పెంచిన పాపాన పోలేదని చెప్పారు. 

​​​​​​​♦  కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధి కరిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడంపై వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ పూనూరు గౌతంరెడ్డి విజయవాడ సత్యనారాయణపురంలోని కార్యాలయంలో సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు. ట్రేడ్‌ యూనియన్‌ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుస్సేన్, తిరుపతి జోనల్‌ ఇన్‌చార్జ్‌ నారపరెడ్డి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

​​​​​​​♦ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధి కరణ నిర్ణయంపై ఏపీ పబ్లిక్‌ హెల్త్‌ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ హర్షం వ్యక్తం చేసింది. ఏలూరులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు చాటుకుంది. సుమారు 3,500 మంది రెగ్యులర్‌ కానున్నట్లు యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు నల్లా అప్పారావు తెలిపారు.  

​​​​​​​♦ ఉత్తరాంధ్రలో జియ్యమ్మవలస, కురుపాం, బొబ్బిలిలో వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియచేయాలంటూ కురుపాం ఎమ్మెల్యే  పుష్పశ్రీవాణికి పుష్పగుచ్ఛం అందజేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top