అమరావతికి రూ.77 వేల కోట్లు అవసరం | Provide special assistance to Andhra Pradesh says Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

అమరావతికి రూ.77 వేల కోట్లు అవసరం

Apr 17 2025 2:45 AM | Updated on Apr 17 2025 2:46 AM

Provide special assistance to Andhra Pradesh says Chandrababu Naidu

16వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లిన సీఎం చంద్రబాబు  

ఇప్పటికి రూ.31 వేల కోట్లు సమీకరించుకున్నాం 

స్వర్ణాంధ్ర–2047 ప్రణాళికకు ఊతం ఇవ్వాలి 

ఏపీకి ఆదాయం లేదు.. రెవెన్యూ లోటు పెరిగిపోతోంది 

పరిస్థితిని అర్థం చేసుకుని ప్రత్యేక సాయం చేయండి   

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రూ.77,249 కోట్లు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు 16వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా వరల్డ్‌ బ్యాంక్, హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ద్వారా ఇప్పటికే రూ.31,000 కోట్లు సమకూరాయన్నారు. ఇంకా సుమారు రూ.47,000 కోట్ల అవసరం ఉందని చెప్పారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌ అరవింద్‌ పనగారియా ఆధ్వర్యంలోని బృందం బుధవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైంది. 

ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 2014లో రాష్ట్ర విభజనతో ఆదాయ వనరులన్నీ తెలంగాణకు వెళ్లాయని, ఏపీకి ప్రధాన ఆదాయ వనరే లేదన్నారు. జీఎస్డీపీలో రాష్ట్ర సొంత ఆదాయ వనరుల శాతం ఏపీలో తక్కువగా ఉందని, రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా ఆస్తుల పంపకం ఇంకా పూర్తవ్వలే­దని చెప్పుకొచ్చారు. ‘ఏటా ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటు పెరిగిపోతోంది. రాజధాని లేకపోవడం వల్ల రెవెన్యూ జనరేషన్‌కు అనేక సమస్యలు ఉన్నాయి. 

ఈ కారణంగా ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టాం. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కేంద్రం కేటాయింపులు జరిపేలా సిఫారసులు చేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవాలని, స్వర్ణాంధ్ర–2047 ప్రణాళికకు ఊతం ఇవ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు, పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు తదితర అంశాలపై ప్రత్యేక ప్రజెంటేషన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనపై వీడియో ప్రదర్శించారు.  

విరివిగా గ్రాంట్లు ఇప్పించండి 
స్వర్ణాంధ్ర–2047 విజన్‌ కింద ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధించి.. 2047 నాటికి 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్‌ అవతరించేలా కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. వికసిత్‌ భారత్‌ సాధనలో భాగంగా ఆర్థిక సంఘం వర్టికల్‌ డివల్యూషన్‌ వాటా ప్రస్తుతం ఉన్న 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలన్నారు. రాష్ట్రాల్లో గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్లు కేటాయించేటప్పుడు 70 శాతం వెయిటేజీ జనాభాకు, 20 శాతం వెయిటేజీ వ్యవసాయం, అనుబంధ రంగాలకు, 10 శాతం వెయిటేజీ ప్రాంతానికి ఇవ్వాలని ప్రతిపాదించారు. 

స్థానిక సంస్థల కోసం రూ.62,516 కోట్ల నిధులు, పట్టణ స్థానిక సంస్థల్లో మౌలిక వసతుల కోసం రూ.19,871 కోట్ల గ్రాంట్లు, 2026–2031 మధ్య ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు రూ.16,181 కోట్లు కావాల్సి ఉందన్నారు. ‘పోలవరం–బనకచర్ల అనుసంధానం, తాగునీటి ప్రాజెక్టులు, ఐదు పర్యాటక హబ్‌లు (అమరావతి, విశాఖపట్నం, అరకు, తిరుపతి, రాజమహేంద్రవరం), ఐఐటీ తిరుపతిలో ఇంక్యుబేషన్‌ సెంటర్, బుద్ధిస్ట్‌ సర్క్యూట్, అమరావతిలో జాతీయ మ్యూజియం, విశాఖపట్నంలో వరల్డ్‌ క్లాస్‌ కన్వెన్షన్‌ సెంటర్, నాలెడ్జ్‌ ఎకానమీలో భాగమైన క్వాంటమ్‌ వ్యాలీ ప్రాజెక్టు, స్కిల్‌ డెవలప్‌మెంట్, రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్, 100 శాతం అక్షరాస్యత, పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు, మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కులు, గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్టులు, ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ వే లు, రహదారులు, రీజనల్‌ గ్రోత్‌ సెంటర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి విరివిగా గ్రాంట్లు ఇచ్చేలా సిఫారసు చేయాలి’ అని సీఎం కోరారు.

 కాగా, పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తొమ్మిది అంశాలతో కూడిన ప్రతిపాదనలను ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌–గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్‌ తెలిపారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement