అరెస్టు చేసిన మావోయిస్టులతో పోలీసు అధికారులు
పక్కా సమాచారంతో ఒకేసారి 50 మందిని అరెస్ట్ చేశాం..
వారి ప్లాన్ ఏమిటనే దానిపై దర్యాప్తు చేస్తున్నాం
కీలక నేత దేవ్జీ లొంగిపోలేదు
ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్హా
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మావోయిస్టులు లొంగిపోవడం మంచిదని, లేకపోతే చర్యలు తప్పవని ఏపీ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేశ్చంద్ర లడ్హా హెచ్చరించారు. విజయవాడలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు హిడ్మా, మరో ఐదుగురు మృతిచెందారని చెప్పారు.
ఘటనాస్థలంలో లభించిన సమాచారంతో ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారనే విషయంపై వెంటనే దృష్టి పెట్టామని వెల్లడించారు. ఆ తర్వాత పక్కా సమాచారంతో ఎన్టీఆర్, కృష్ణా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని వివరించారు. హిడ్మా దళానికి చెందిన 27 మందితోపాటు సౌత్ బస్తర్ ఏరియా కమిటీ, స్థానిక కేడర్తో సహా అరెస్టయిన వారందరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారని చెప్పారు.
మావోయిస్టు కీలక నేత దేవ్జీ లొంగిపోలేదని తెలిపారు. ఎక్కడా ఎవరికీ ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంతమంది మావోయిస్టులను పట్టుకోవడం తొలిసారి అని వివరించారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత కొందరు మావోయిస్టులు పారిపోయారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయన్నారు.

షెల్టర్ కోసమే వచ్చారు...
ఇటీవల తెలంగాణలో కొంతమంది మావోయిస్టులు సరెండర్ అయ్యారని, వారి ద్వారా సమాచారం వెళితే ఇబ్బందులు ఉంటాయని మావోయిస్టులు భావించారని లడ్హా తెలిపారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో చాలాచోట్ల ముమ్మరంగా దాడులు జరుగుతున్నాయన్నారు. అందుకే కొన్ని రోజులు షెల్టర్ తీసుకునేందుకు ఏపీని ఎంచుకున్నారని చెప్పారు. మళ్లీ సమయం చూసి తమ ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు.
అయితే, మావోయిస్టుల కదలికలపై నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం ఉందని, వారి ప్రణాళికలపై మాత్రం సమాచారం లేదన్నారు. మావోయిస్టుల ప్లాన్ ఎమిటి? కానూరులో ఎందుకు ఉన్నారు? వారికి ఎవరు షెల్టర్ ఇచ్చారు? అసలు ఇక్కడికి ఎలా వచ్చారు? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
జర్నలిస్టులకు హిడ్మా లేఖ రాయడం గురించి తమకు తెలియదన్నారు. ఎదురు కాల్పుల్లోనే హిడ్మా మృతిచెందారని, పట్టుకుని చంపారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అప్రమత్తంగా ఉండాలని ఏజెన్సీలోని ప్రజాప్రతినిధులకు సూచించినట్లు తెలిపారు.
మారేడుమిల్లి ప్రాంతంలో మరో ఎన్కౌంటర్..
మారేడుమిల్లి ఏజెన్సీ ఏరియాలో మంగళవారం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి 5 కిలో మీటర్ల దూరంలోనే బుధవారం ఉదయం 7 గంటలకు మరోసారి భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు లడ్హా తెలిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారని, వారిలో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారన్నారు. చనిపోయినవారిలో జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఒక్కరినే గుర్తించామన్నారు. శ్రీకాకుళానికి చెందిన జోగారావు పదేళ్లుగా మావోయిస్టు పారీ్టలో కొనసాగుతున్నారని తెలిపారు.
ఆయుధాలు, రూ.12.72లక్షల నగదు స్వాధీనం
అరెస్ట్ చేసిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఒక పిస్టల్, రెండు రివాల్వర్లు, రెండు డీబీబీఎల్ఎస్, 31 దేశీయ తయారీ తుపాకులు, చెక్కతో తయారు చేసిన 8ఎంఎం తపంచాలు ఉన్నాయి. వాటితోపాటుగా 302 రౌండ్ల బుల్లెట్లు, రెండు మేగజైన్లు తూటలు, నాలుగు కత్తులు, కోర్డిటెక్స్ వైర్ 750 గ్రాములు, రూ.12.72 లక్షల నగదుతోపాటుగా 64 మెమొరీ కార్డులను, ఒక రేడియో సెట్ను స్వా«దీనం చేసుకున్నారు.
విజయవాడకు మావోయిస్టులు
ఏలూరు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అరెస్ట్ చేసిన 50 మంది మావోయిస్టులను భారీ భద్రత మధ్య విజయవాడలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కు తరలించారు. వీరిలో మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు ముగ్గురు, డివిజనల్ కమిటీ సభ్యులు ఐదుగురు, ఏరియా కమిటీ సభ్యులు 19 మంది, పార్టీ సభ్యులు 23 మంది ఉన్నారు. వారి నుంచి స్వా«దీనం చేసుకున్న రైఫిల్స్, పిస్టల్స్, డిటోనేటర్లు, మేగజైన్స్, మొబైల్స్, సిమ్ కార్డులు, పెన్ డ్రైవ్లు, విప్లవ సాహిత్యం, హిడ్మా ఫొటోలను కూడా విజయవాడ తీసుకొచ్చారు.
మీడియా సమావేశం అనంతరం మళ్లీ ఏ జిల్లాలో దొరికిన మావోయిస్టులను ఆ జిల్లాకు తరలించారు. మీడియా సమావేశంలో ఎస్ఐబీ ఐజీ పీహెచ్డీ రామకృష్ణ, ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్, ఐదు జిల్లాల ఎస్పీలు విద్యాసాగర్ నాయుడు, ప్రతాప్ శివకిశోర్, రాహుల్మీనా, బిందుమాదవ్, విజయవాడ సీపీ రాజశేఖరబాబు, డీసీపీలు కేజీవీ సరిత, కృష్ణప్రసన్న, లక్ష్మీనారాయణ ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
అరెస్ట్ చేసిన మావోయిస్టుల వివరాలు
కృష్ణా జిల్లాలో...
1) ఉద్దె రఘు (స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు)
2) మదకం దివాకర్ అలియాస్ మిట్టు (ఏరియా కమిటీ సభ్యుడు)
3) వెట్టి నందె (ఏరియా కమిటీ సభ్యుడు)
4) ఓయం సంబట్టి అలియాస్ సమిత (ఏరియా కమిటీ సభ్యురాలు)
5) కొర్సా సోమ్ల్ అలియాస్ పరిమిళ (ఏరియా కమిటీ సభ్యురాలు)
6) కుంజం రాంబు (పార్టీ సభ్యుడు),
7) దొడి నీలేష్ (పార్టీ సభ్యుడు)
8) మదకం గంగి (పార్టీ సభ్యులు)
9) హేమల్ల రమే (పార్టీ సభ్యులు)
10) మదకం హైమ (పార్టీ సభ్యులు)
11) సోడి అర్జున్ అలియాస్ సంజు (పార్టీ సభ్యులు)
12) కర్టం బండి (పార్టీ సభ్యులు)
13) మదకం బుజ్జి అలియాస్ మంగ్లీ (పార్టీ సభ్యురాలు)
14) మదకం నవ్య అలియాస్ యుగి (పార్టీ సభ్యురాలు)
15) మండ్వీ లక్ష్మి (పార్టీ సభ్యురాలు)
16) మదకం పుజీ అలియాస్ రితిక (పార్టీ సభ్యురాలు)
17) హేమ్ల హిడ్మీ అలియాస్ నిర్మల (పార్టీ సభ్యురాలు)
18) పుణెం ఇష్టు అలియాస్ సరీనా (పార్టీ సభ్యులు)
19) మదకం హంగు అలియాస్ రోహన్ (పార్టీ సభ్యులు)
20) పుల్సు లక్ష్మణ్ (పార్టీ సభ్యులు)
21) మడ్వీ జోగి (పార్టీ సభ్యులు)
22) తాతి లక్ష్మి (పార్టీ సభ్యురాలు)
23) నుప్పు కోసి (పార్టీ సభ్యురాలు)
24) ఓయం జ్యోతి (పార్టీ సభ్యురాలు)
25) కోర్స శాంతి (పార్టీ సభ్యురాలు)
26) కుంజం భీమి (పార్టీ సభ్యురాలు)
27) ఎం.జోగి (పార్టీ సభ్యులు)
28) మడ్వీ మహిణి (పార్టీ సభ్యురాలు)
ఏలూరు జిల్లాలో...
1) సోదె లచ్చు అలియాస్ గోపాల్ (స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు)
2) సోదె లక్మా అలియాస్ భీమ (డివిజనల్ కమిటీ సభ్యుడు)
3) గంగి లక్ష్మి అలియాస్ మాదే (డివిజనల్ కమిటీ సభ్యుడు)
4) వెంటి వెంకట్ (ఏరియా కమిటీ సభ్యుడు)
5) మదకం వాగా (ఏరియా కమిటీ సభ్యుడు)
6) కశ్యప్ భీమా అలియాస్ యోగేష్ (ఏరియా కమిటీ సభ్యుడు)
7) పుడియం ఆనంద్ అలియాస్ దన్ను (ఏరియా కమిటీ సభ్యుడు)
8) మదకం లక్ష్మణ్ అలియాస్ కోసా (ఏరియా కమిటీ సభ్యుడు)
9) కుంజం బుజ్జి (ఏరియా కమిటీ సభ్యుడు)
10) తాతీ కమల (ఏరియా కమిటీ సభ్యురాలు)
11) దాది ఆద్మా అలియస్ మల్లేష్ (ఏరియా కమిటీ సభ్యుడు)
12) మడ్వీ జోగా (ఏరియా కమిటీ సభ్యుడు)
13) మడ్వీ సునీత, 14) కుంజం నందిని (ఏరియా కమిటీ సభ్యులు)
15) బాడిశ రాజు (ఏరియా కమిటీ సభ్యుడు)
ఎన్టీఆర్ జిల్లాలో..
1) పోడియం రెన్గు (స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు)
2) సోడి మనల్ల (డివిజనల్ కమిటీ సభ్యుడు)
3) మదకం మదన్ అలియాస్ మధన్న (డివిజన్ కమిటీ సభ్యుడు )
4) సోడి మంగీ (ఏరియా కమిటీ సభ్యురాలు)
కాకినాడ జిల్లాలో...
1) పోట్టం కాంతి (ఏరియా కమిటీ సభ్యురాలు)
2) మడ్వీ కోసి (ఏరియా కమిటీ సభ్యురాలు)
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో...
1) మడ్వీ హంధా (డివిజనల్ కమిటీ సభ్యులు)


