‘వాళ్ల అమ్మను చివరిసారి ఐ లవ్ యూ అంటూ కౌగిలించుకుంది’
విజయవాడ: తమ మనవరాలు ఆత్మహత్య చేసుకోవడానికి టీడీపీ నేత వినోద్ జైన్ కారణమని బాలిక తాత మాణిక్యాలరావు ఆవేదన వ్యక్తం చేశారు. బయటకు మాట్లాడలేని విధంగా వినోద్ జైన్ లైంగికంగా వేధించినట్లు సూసైడ్ నోట్లో రాసిందని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తన మనవరాలు ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదని, కాకపోతే నిన్న మధ్యాహ్నం నుండి మూడీగా ఉందన్నారు.
‘సాయంత్రం నాలుగు గంటల సమయంలో నేను మా కుమార్తె వాకింగ్ కి వెళ్తున్న సమయంలో పలకరించింది. ఒకసారి వాళ్ళ అమ్మ వద్దకు వచ్చి ఐలవ్ యూ మమ్మీ అంటూ రెండుసార్లు మాట్లాడి తల్లిని కౌగిలించుకుంది. ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పలేదు. తరువాత మా కుమార్తె, నేను వాకింగ్ కి వెళ్ళాం. అపార్ట్ మెంట్ వాసులు ఎవరో చిన్నారి సూసైడ్ చేసుకుందని చెబితే అక్కడికి వెళ్లి చూశాం. అక్కడ నిర్జీవంగా నా మనవరాలు పడి ఉంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాం. సంఘటనా స్థలానికి వచ్చి పోలీసులు మా మనవరాలు బెడ్ రూమ్కి వెళ్లారు. బెడ్రూమ్ లో తన బుక్ లో సూసైడ్ నోట్ రాసి ఉంది.
అందులో మేము మాట్లాడలేని విధంగా వినోద్ జైన్ లైంగికంగా వేధించినట్లు రాసింది. నా మనవరాలు మరణానికి కారణమైన వినోద్ జైన్ ని కఠినంగా శిక్షించాలి అని బాలిక తాత మాణిక్యలరావు కన్నీటిపర్యంతమయ్యారు. విజయవాడ విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్లోని ఒక అపార్ట్మెంట్ పైనుంచి దూకి బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేకెత్తించింది. టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ బాలిక సూసైడ్ నోట్లో రాయడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.