
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ వేధింపుల పర్వంపై వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. వావివరసలు లేకుండా సొంత కుటుంబ సభ్యులనే కాకుండా ప్రజలను, తన సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, చదువుకుంటున్న మైనర్ బాలికలను కూడా వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గద్దలు, డేగలు కోడి పిల్లల్ని తన్నుకుపోవడానికి పైనుంచి గురి చూసినట్లే నారాయణ అమాయక అబలలపై కన్నేసి వారిని ఖతం చేస్తున్నారని ఆరోపించారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రకాశం జిల్లాలో కట్టిన ఫ్లెక్సీల్లో ‘అసలోడు వచ్చే వరకే కొసరోడికి పండుగ’ అని రాసి ఉందన్నారు.
‘అసలోడు .. కొసరోడు’.. ఇందులో అంతరార్థం ఏమిటో చంద్రబాబు అధికారికంగా స్పష్టత ఇవ్వాలని కోరారు. కొసరోడు అంటే ఆ జిల్లాలో యువగళం చేస్తున్న చినబాబు కాదు కదా? అని ప్రశ్నించారు. ప్రజలకు వచ్చిన సందేహాన్నే తాను కూడా ప్రస్తావిస్తున్నానని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈవెంట్ మేనేజ్మెంట్లో చంద్రబాబును మించిన వారెవరూ ఉండరని ఎద్దేవా చేశారు. ప్రతి కార్యక్రమానికి ఏదో ఒక ఆకర్షణను జత చేసి జనాన్ని మొబిలైజ్ చేయడం ఆయనకు మొదటి నుంచీ అలవాటేనన్నారు. చినబాబు యువగళం యాత్రకు గ్లామర్ అద్దేందుకు టీవీ యాంకర్ను హైదరాబాద్ నుంచి రప్పించడం ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి ఇక నుంచి సినీనటుల సందడి మొదలవుతుందనేది అర్థమవుతోందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.