
రాజ్ కేసిరెడ్డి కంపెనీల్లో వాళ్లిద్దరూ భాగస్వాములు
ఒకే చిరునామాతో రెండు కంపెనీలు
రెండు కంపెనీలకూ ఒకే ఈ–మెయిల్ ఐడీ
రియల్ ఎస్టేట్ నల్లధనాన్ని భారీగా విదేశాలకు తరలించిన కేశినేని చిన్ని దంపతులు
వారిద్దరిని విచారించి ప్రభుత్వం జవాబుదారీతనం నిరూపించుకోవాలి
సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో మాజీ ఎంపీ కేశినేని నాని డిమాండ్
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం నమోదు చేసిన మద్యం కుంభకోణం కేసులో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఆయన భార్య జానకీలక్ష్మిపై సత్వరం విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) సీఎం చంద్రబాబును కోరారు. ఈ కేసులో సిట్ అరెస్టు చేసిన రాజ్ కేసిరెడ్డి వ్యాపార సంస్థల్లో కేశినేని చిన్ని దంపతులు భాగస్వాములని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు చంద్రబాబుకు సోమవారం రాసిన లేఖను ‘ఎక్స్’లో పోస్టు చేశారు. రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులని ఆయన తెలిపారు. ఇషన్వీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పీ హైదరాబాద్లోని ఒకే చిరునామాతో (జూబ్లీ హిల్స్, సర్వే నంబర్ 403, ప్లాట్ నంబర్ 9)తో రిజిస్టర్ కావడంతోపాటు ఆ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడీ (accounts@ wshanviinfraprojects.com)నే ఉపయోగిస్తుండటం గమనార్హమని చెప్పారు. కేశినేని చిన్ని హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని విదేశాలకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారన్నారు.
దుబాయ్, అమెరికాలో అక్రమ పెట్టుబడులు
కేశినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్, కేశినేని గ్లోబల్ ఎంటర్ప్రైజస్ కంపెనీలు దుబాయ్, అమెరికాలో అక్రమంగా పెట్టుబడులు పెట్టినట్టు కేశినేని నాని తెలిపారు. ఈ కంపెనీలు భారీఎత్తున నిధులను అక్రమంగా విదేశాలకు తరలించి మనీలాండరింగ్కు పాల్పడ్డాయన్నారు. రాజ్ కేసిరెడ్డి, ఆయన సహచరుడు దిలీప్ కంపెనీల్లో ఎంపీ కేశినేని చిన్ని, ఆయన భార్య జానకీలక్ష్మి భాగస్వాములుగా ఉన్నారని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్, హవాలా, మూడో పార్టీ ఒప్పందాల పేరుతో భారీగా అక్రమ నిధులు విదేశాలకు తరలించారని తెలిపారు. తక్షణం కేశినేని చిన్ని దంపతులపై విచారణ చేపట్టి రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరిస్తుందనే విషయాన్ని నిరూపించుకోవాలన్నారు. కేశినేని చిన్ని విదేశాలకు అక్రమంగా నిధులు తరలించేందుకు ఉపయోగించిన కంపెనీల పేర్లను కేశినేని నాని ఆ లేఖలో పేర్కొన్నారు.