
సాక్షి, ఢిల్లీ: అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు విమానయాన రంగంలో అనుభవం లేదు. రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న అంటూ వ్యాఖ్యలు చేశారు. భారత ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని రామ్మోహన్ నాయుడును తొలగించాలి అని అన్నారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఢిల్లీలో సాక్షితో మాట్లాడుతూ..‘ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి. రామ్మోహన్ నాయుడుకు విమానాయన రంగంలో అనుభవం లేదు. ఒక గంట కూడా విమానయాన రంగం గురించి ఆయన చదవలేదు. రామ్మోహన్ నాయుడుతో వ్యక్తిగత గొడవలు లేవు. ఆయనకు ఇంకా కేబినెట్ పదవి రావాలని కోరుకుంటాను. కానీ, భారత ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని రామ్మోహన్ నాయుడును తొలగించాలి. ప్రధాన మంత్రిపై అనేక దేశాల నుంచి ఒత్తిడి రాక ముందే రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి.
ప్రధాని మోదీ కూడా రిటైర్మెంట్ ప్రకటించాలి. ప్రధాని బాధ్యతను అమిత్ షా కు అప్పగించాలి. విమాన ప్రమాదం తరువాత ఎయిర్ ఇండియా సీఈఓ, విదేశాంగ మంత్రి రాజీనామా చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. భారత ప్రతిష్ట కాపాడటం కోసం తప్పు చేసిన వారికి శిక్ష విధించాలి. జీ-7 సమ్మిట్లో విమాన ప్రమాదం ఏవిధంగా జరిగిందనేది చర్చ జరగనుంది. ముందస్తుగా ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ప్రధాని, విమానయాన శాఖ మంత్రి రాజీనామా చేయాలని సుబ్రమణ్య స్వామి డిమాండ్ చేశారు. అదానీ అభివృద్ధికి తీసుకోవడం, ఎయిర్ పోర్టు పక్కన భవనాలు ఉండటంతో ప్రమాదం జరిగిందంటున్నారు. దీనిపై విచారణ చేపట్టాలి’ అని కామెంట్స్ చేశారు.