బాధిత కుటుంబాలకు సత్వర పరిహారం
మార్గదర్శకాలు జారీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ బీమా, వైఎస్సార్ మత్స్యకార భరోసా, వైఎస్సార్ పశు నష్టపరిహార పథకాలతోపాటు రైతుల ఆత్మహత్యల ఘటనల్లో బాధిత కుటుంబాలను సకాలంలో ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా బాధిత కుటుంబాలను వెంటనే గుర్తించి.. వారికి సకాలంలో పరిహారం అందించేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది.
బాధిత కుటుంబాలకు సకాలంలో నష్టపరిహారం అందించేలా చూడాల్సిన బాధ్యతను జాయింట్ కలెక్టర్లు (గ్రామ, వార్డు సచివాలయాలు)కు అప్పగించారు. జాయింట్ కలెక్టర్ ప్రతి 15 రోజులకోసారి సంబంధిత జిల్లా, మండల, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించి కలెక్టర్కు నివేదిక సమర్పించాలి. దీనిపై కలెక్టర్ నెలకోసారి సమీక్షించి గ్రామ, వార్డు సచివాలయాల రాష్ట్ర డైరెక్టర్కు నివేదించాలి. డైరెక్టర్ అన్ని జిల్లాల నుంచి వచ్చిన నివేదికలను పరిశీలించి ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.