
నాగులకొండ అటవీ ప్రాంతంలో కొండలు పిండి
చినబాబు కనుసన్నల్లో మైనింగ్
మెట్టలో సహజ వనరుల దోపిడీ
గిరిపుత్రులకు గుండు సున్నా
ఉపాధీ లేదు.. ఉద్యోగాలూ లేవు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికారం అండతో వేల కోట్ల రూపాయల విలువైన సహజ వనరులు సరిహద్దులు దాటి తరలిపోతున్నాయి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో ఉప ప్రణాళికా ప్రాంతమైన వంతాడ సమీపంలోని గిరిజనాపురం నాగులకొండ అటవీ ప్రాంతంలో అక్రమార్కులు కొండలు పిండి చేస్తున్నారు. అధికార పార్టీ అండదండలతో రాత్రి, పగలు అనే తేడా లేకుండా వందలకొద్దీ టిప్పర్లతో గ్రావెల్, లేటరైట్ తరలించుకుపోతున్నారు.
ఏం జరిగిందంటే..
గిరిజనాపురం అటవీ ప్రాంతంలో సుమారు 250 ఎకరాల్లో 2014లో లేటరైట్ ఖనిజం తవ్వకాలకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఒక ప్రైవేటు కంపెనీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అప్పటి నుంచీ 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకూ.. అధికార టీడీపీ పెద్దల అండదండలతో అక్కడ పెద్ద ఎత్తున లేటరైట్ తవ్వకాలు విచ్చలవిడిగా సాగాయి. ప్రారంభంలో ఆరేడు వాహనాలతో నడిచిన దందా చివరాఖరుకు 25 వాహనాలతో వందలాది ట్రిప్పులు వేసే స్థాయికి చేరుకుంది. గత ఎన్నికల్లో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి తిరిగి అధికారంలోకి రావడంతో ఇప్పుడు మళ్లీ గిరిజనాపురం పరిసర ప్రాంతాల్లోని కొండలను పిండి చేసేస్తున్నారు.
లేట్రైట్ను తవ్వి తీసి ప్రత్తిపాడు మండలం ఆరళ్లధార డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. దీంతోపాటు తొండంగి మండలం రావికంపాడు వద్ద మరో డంపింగ్ యార్డు కూడా ఉంది. రావికంపాడు యార్డు నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా టన్నుల కొద్దీ లేటరైట్ను సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో మైనింగ్ జరుగుతున్నా వంతా డ, గిరిజనాపురం ప్రాంతాల గిరిజనులకు ఒరిగిందేమీ లేదని గిరిజన సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. కొండలనే నమ్ముకున్న తమ నోటి దగ్గర కూడు కూడా కబళించేస్తున్నారని అడవి బిడ్డ లు ఆందోళన చెందుతున్నారు.
రోజుకు 440 ట్రిప్పులు
ఈ రెండు డంపింగ్ యార్డులకు రోజుకు ఒక్కో టిప్పర్తో సుమారు 20 ట్రిప్పుల చొప్పున లేటరై ట్ తరలిస్తున్నారు. ఈవిధంగా రోజుకు 25 వాహ నాలతో తక్కువలో తక్కువ 440 ట్రిప్పుల వరకూ లేటరైట్ తరలిస్తున్నారని అంచనా. నిబంధనలు తుంగలో తొక్కి ఒకో టిప్పర్లో 30 టన్నులకు మించి తరలిస్తున్నారు. గిరిజనాపురం అటవీ ప్రాంతంలో నాలుగు ఆధునిక యంత్రాలతో లేటరైట్ తవ్వుతున్నారు. గతంలో రెండు క్రషర్లు పని చేస్తే ఇప్పుడు మరో రెండింటిని జోడించారు. రా త్రి, పగలు అనే తేడా లేకుండా పదుల సంఖ్యలో టిప్పర్లు భారీ లోడుతో దుమ్ము రేపుతూ వెళుతుంటే ప్రమాదాలు జరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని స్థానిక గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చినబాబు కనుసన్నల్లోనే విశాఖకు చెందిన అధికార పారీ్టల కీలక ప్రజాప్రతినిధి అనుచరులు అనుమతికి మించి కొండలను పిండి చేసేస్తున్నారని మండిపడుతున్నారు.
పోడు భూములకు పట్టాలివ్వాలి
వంతాడ పరిసర అటవీ ప్రాంతంలోని గిరిజనులకు 30 ఏళ్లుగా పోడు భూముల పట్టాలు ఇవ్వడం లేదు. ఆ భూములను ప్రైవేటు సంస్థలకు లీజులకు ఇస్తూ రూ.కోట్ల విలువైన ఖనిజ సంపదను రాత్రి, పగలు అనే తేడా లేకుండా తవ్వేసి, తరలించుకుపోతున్నారు. ఫలితంగా వ్యవసాయ భూములతో కళకళలాడాల్సిన భూములు భారీ గోతులతో అగాధాల్లా మిగులుతున్నాయి. అధికారులు స్పందించి తక్షణమే పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలి. – కొసిరెడ్డి గణేశ్వరరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి సీపీఐ (ఎంఎల్ – వినోద్ మిశ్రా)