విశాఖపట్నం: ఆర్భాటాలు, అట్టహాసాలకు దూరంగా ఇద్దరు యువ ఐఏఎస్ అధికారులు ఎంతో నిరాడంబరంగా వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్గా పనిచేస్తున్న టి. శ్రీపూజ, మేఘాలయలో దాదెంగ్రి జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆదిత్య వర్మ శుక్రవారం విశాఖపట్నంలో ఒక్కటయ్యారు.
విశాఖలోని కైలాసగిరి శివాలయంలో పూలమాలలు మార్చుకుని సాంప్రదాయ పద్ధతిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరై, కొత్త వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వారు నేరుగా వన్టౌన్ జాయింట్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సంతకాలు చేసి తమ వివాహాన్ని చట్టబద్ధంగా నమోదు చేసుకున్నారు. విశాఖపట్నం డీఐజీ బాలకృష్ణ దగ్గరుండి ఈ వివాహ నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు.
వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు బ్యాచ్లకు చెందిన ఈ ఇద్దరి వివాహం పెద్దలు కుదిర్చినదే అని వధువు తండ్రి వెంకటేశ్వర్లు తెలిపారు. ఖరీదైన పెళ్లిళ్లు సాధారణమైపోయిన ఈ రోజుల్లో, ఉన్నత హోదాలో ఉన్న అధికారులు ఇలా నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడం సమాజానికి ఒక ఆదర్శంగా నిలిచింది.


