కోవిడ్‌ నియంత్రణకు ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ భారీ విరాళం

Huge Donation By NRI Doctor For Covid Control - Sakshi

రూ. 5 కోట్ల విలువైన వైద్య పరికరాలు అందించిన డా. ప్రేమ్‌రెడ్డి

సాక్షి, అమరావతి: పుట్టినగడ్డపై ప్రేమతో ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ ప్రేమ్‌సాగర్‌రెడ్డి (ప్రేమ్‌రెడ్డి)భారీ విరాళం ఇచ్చారు. కరోనా పేషెంట్ల కోసం రూ. 5 కోట్లు విలువ చేసే 500 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లు, బిపాప్‌ మెషిన్లు, ఇతర వైద్య పరికరాలు రాష్ట్రానికి పంపారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తొలి సహాయంగా ఈ విరాళం ఇచ్చామని, మరింత సహాయం అందిస్తామని ఆ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో కరోనాతో ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అందరూ ఒక్కతాటిపైకి రావాలని  ప్రేమ్‌రెడ్డి అన్నారు. ప్రస్తుత పరిస్థితులు వైద్యరంగం, ఆస్పత్రులపై విపరీతమైన ఒత్తిడి పెంచుతోందన్నారు.

ప్రాణాలను నిలబెట్టే ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు వంటి అత్యవసర వనరులను పంపుతున్నామని తెలిపారు. కాగా, నెల్లూరు జిల్లా, నిడిగుంటపాలెంకు చెందిన డాక్టర్‌ ప్రేమ్‌రెడ్డి 70వ దశకంలో అమెరికాకు వెళ్లారు. ఆ దేశంలోని 14 రాష్ట్రాల్లో ప్రైమ్‌ హెల్త్‌కేర్‌ పేరిట 46 ఆస్పత్రులను నెలకొల్పారు. ప్రైమ్‌ హెల్త్‌కేర్‌ ఫౌండేషన్‌ స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైద్య విద్య సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి క్లాస్‌మేట్‌ అయిన ప్రేమ్‌రెడ్డి.. వైఎస్సార్‌ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేయడానికి హెల్త్‌కేర్‌ ఫౌండేషన్‌ స్థాపించినట్లు తెలిపారు. గతంలో 120 వాటర్‌ ప్లాంట్‌లు నెలకొల్పడానికి రూ. 5 కోట్లు విరాళం ఇచ్చారు. స్వగ్రామంలో అధునాతన స్కూల్‌ బిల్డింగ్‌ నిర్మాణంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కోవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని ఒక్కటి చేసిందని, మానవతా దృక్పథంతో దేశానికి సహాయం అందిస్తున్నామని ఈ సందర్భంగా ప్రేమ్‌రెడ్డి కుమార్తె, హెల్త్‌కేర్‌ ఫౌండేషన్‌ ఎండీ కవితా రెడ్డి పేర్కొన్నారు.

చదవండి: సీఎం జగన్‌కు ప్రవాసాంధ్రుల కృతజ్ఞతలు  
Andhra Pradesh: ఆ వైద్యుడి చికిత్స ఖర్చు ప్రభుత్వానిదే..! 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top