సాక్షి, విశాఖపట్నం: వరుసగా క్రూడాయిల్, వంట గ్యాస్ వెసల్స్ రాకతో విశాఖపట్నం పోర్టు కళకళలాడుతోంది. శుక్రవారం కూడా భారీ స్థాయిలో ముడిచమురు, ఎల్పీజీ నౌకలు విశాఖ పోర్టుకు చేరుకున్నాయి. రష్యా నుంచి ‘ఎమ్టీ జంబో’ భారీ నౌక 1,36,728 మెట్రిక్ టన్నుల ముడిచమురుతో వచ్చింది. దీనికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్లోడింగ్ ప్రారంభించారు.
మరోవైపు, దేశీయ అవసరాల నిమిత్తం నెదర్లాండ్స్ నుంచి గురువారం సాయంత్రం చేరుకున్న బీడబ్ల్యూ బిర్చ్ వెసల్ 24,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో వచ్చి లోవా గార్డెన్ సమీపంలోని ఎల్పీజీ బెర్త్ వద్ద బెర్తింగ్ చేశారు. ఇప్పటికే పోర్టులో ఉన్న ‘ఎమ్టీ సెంచూరియన్–1 వెసల్లో ఉన్న లక్ష టన్నుల ముడి చమురును అన్లోడ్ చేస్తుండగా, ఈనెల 30న అమెరికా నుంచి మరిన్ని గ్యాస్ నౌకలు విశాఖపట్నం రానున్నట్లు పోర్టు అధికారులు వెల్లడించారు.


