ఐదు రోజుల్లో ఇలా.. విజయవంతంగా ‘ఫ్యామిలీ డాక్టర్‌’ ట్రయల్‌ రన్‌ 

Family Doctor System Successfully Trial Run In AP - Sakshi

ఐదు రోజుల్లో 89,705 మందికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు, మందులు 

3,160 విలేజ్‌ క్లినిక్స్‌ సందర్శించిన వైద్యులు 

37వేల మందికి సాధారణ ఆరోగ్య పరీక్షలు 

3,540 మంది గర్భిణులకు యాంటినేటల్‌ కేర్‌ పరీక్షలు

ఉగాది నుంచి పూర్తిస్థాయిలో ‘ఫ్యామిలీ డాక్టర్‌’ అమలు 

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: వైఎస్సార్‌ విలేజ్, వార్డు క్లినిక్స్‌ ద్వారా ఈ నెల 21 నుంచి రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఫ్యామిలీ డాక్టర్‌’ విధానం ట్రయల్‌ రన్‌ జోరుగా కొనసాగుతోంది. కేవలం ఐదు రోజుల్లోనే 26 జిల్లాల్లోని 3,160 వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో విజయవంతంగా ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈ ఐదు రోజుల్లో 89,705 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా అవసరమైన వారికి ఉచితంగా మందులిచ్చారు.
చదవండి: AP: ఇక ఎన్నైనా సర్టిఫికెట్లు.. సచివాలయాల్లో సరికొత్త సేవలు 

పక్షవాతంతో, నరాల బలహీనతలతో నడవలేని వారి ఇళ్లకు డాక్టర్లు, వైద్య సిబ్బం ది స్వయంగా వెళ్లి పరీక్షలు నిర్వహించి మందులిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిజానికి ఈ ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ కోసం ప్రతి పీహెచ్‌సీలో ప్రభుత్వం ఇద్దరు డాక్టర్లను నియమించింది. 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌తో సహా సిబ్బంది, డాక్టర్‌తో పాటు ఆశా వర్కర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఐదు రోజుల్లో..
ఓపీల ద్వారా 37,309 మందికి సాధారణ వైద్య పరీక్షలను నిర్వహించారు.  
జ్వరంతో బాధపడుతున్న 11,247మందికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు.  
3,540 మంది గర్భిణులకు యాంటినేటల్‌ కేర్‌ పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు.  
607 మంది బాలింతలకు, వారి బిడ్డలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు.  
2,956మందికి రక్తహీనత పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు.  
ఇక జీవనశైలి జబ్బులతో పాటు అసంక్రమిత వ్యాధులతో బాధపడుతున్న 34,046 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 
మరోవైపు.. 67 రకాల మందులతో పాటు 14 రకాల ర్యాపిడ్‌ కిట్లను వైఎస్సార్‌ విలేజ్‌ 
క్లినిక్స్‌లో అందుబాటులో ఉంచారు.  

ప్రత్యేక యాప్‌ ద్వారా పర్యవేక్షణ
ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ట్రయల్‌ రన్‌ అమలును ప్రత్యేక యాప్‌ ద్వారా  ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. డాక్టర్లు, సిబ్బంది ప్రవర్తనను తెలుసుకునేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుచేశారు. ట్రయల్‌ రన్‌లో ఎదురయ్యే ఇబ్బందుల ఆధారంగా వాటిని సరిచేసుకుని ఉగాది నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్‌్టను అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విధానంపై పల్లెల్లోని అన్ని వర్గాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు.

జగన్‌బాబుకు రుణపడి ఉంటాం 
నేను బీపీ, షుగర్, శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నాను. రెండు మూడుసార్లు ప్రైవేట్‌ ఆçస్పత్రిలో చూపించుకున్నాను. వెళ్లినప్పుడల్లా రూ.4వేలకు పైగా అవుతోంది. ఈసారి మా విలేజ్‌ క్లినిక్‌లో డాక్టర్‌కి చూపించాను. పరీక్షించి మందులిచ్చారు. ఊర్లోనే డాక్టర్‌ వైద్యం చేయడం మాలాంటి వృద్ధులకు మంచిది. సీఎం జగన్‌ బాబుకు రుణపడి ఉంటాం.  
– సన్యాసిదేవుడు, గన్నవరం, అనకాపల్లి జిల్లా 

మాలాంటి వారికి ఒక వరం 
సీఎం పుణ్యాన ఉచితంగా వైద్యం చేయడంతోపాటు ఇంటి వద్దకే వైద్యుడు రావడం సంతోషంగా ఉంది. మాలాంటి బీద వారికి ఫ్యామిలీ డాక్టర్‌ పథకం ఒక వరం. ఇప్పటివరకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఆర్‌ఎంపీ దగ్గరకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఎక్కడికీ వెళ్లాల్సిన బాధలేదు.  
– లక్ష్మీదేవి, ముద్దినాయనపల్లి, అనంతపురం జిల్లా 

ఫ్యామిలీ ఫిజీషియన్‌కు మంచి ఆదరణ  
ఈ పథకానికి ప్రజల్లో మంచి ఆదరణ వస్తోంది. ఇందుకు ఉద్యోగులుగా మా సహకారం ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అందిస్తాం. ఇప్పటివరకు పేదలు అప్పులుచేసి పట్టణాల్లో వైద్యం చేయించుకునేవాళ్లు. ఇప్పుడొక ఎంబీబీఎస్‌ డాక్టర్‌ నేరుగా ఇంటివద్దే వైద్యం అందించడం గొప్ప విషయం. ప్రజల్లో దీనిపై అవగాహన కలి్పస్తాం.   
– జక్కల మాధవ, ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top