ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 10 మంది ఇళ్లలో సోదాలు
అడిగిందే అడుగుతూ రొటీన్ ప్రశ్నలు
ఉదయం నుంచి సాయంత్రం దాకా హంగామా
సాక్షి, అమరావతి: మద్యం విధానంపై అక్రమ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, హైదరాబాద్లోని పలువురి నివాసాల్లో శుక్రవారం సోదాలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసు ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ ఈ కేసు నమోదు చేసింది. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, హైదరాబాద్లోని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, రిటైర్డ్ అధికారి కృష్ణమోహన్రెడ్డి, మరికొందరి నివాసాల్లో సోదాలు నిర్వహించారు.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి, ఆయన సమీప బంధువు నివాసంలోనూ సోదాలు చేశారు. పది మంది ఇళ్లలో దాడులు జరిగాయి. అందరి ఇళ్ల వద్ద ఈడీ అధికారులకు అన్ని విధాలుగా సహకరించడంతో వారు సోదాలు పూర్తి చేసుకుని వెళ్లారు. ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో పాటు వారు అడిగిన డాక్యుమెంట్లు అందజేసినట్లు తెలిసింది.
అడిగిందే అడుగుతూ రొటీన్ ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన సోదాల్లో పెద్దగా ఏమీ లభించలేదని తెలిసింది. ఇదిలా ఉండగా గత ప్రభుత్వ మద్యం విధానంపై ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీని ఆధారంగానే ఈడీ కూడా కేసు నమోదు చేసిన క్రమంలో శుక్రవారం సోదాలు కొనసాగించారు.


