ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన అనిల్‌ కుంబ్లే

Cricketer Anil Kumble Meets AP CM YS Jagan Mohan Reddy - Sakshi

తాడేపల్లి: టీమిండియా మాజీ కోచ్‌, దిగ్గజ స్పిన్‌ బౌలర్‌ అనిల్‌ కుంబ్లే.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ఆయన.. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరువురి మధ్య క్రీడల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఏపీలో స్పోర్ట్స్‌ యూనివర్శిటీ, క్రీడా సామగ్రి తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఇరువురు చర్చించారు. ఈ రెండు ప్రాజెక్ట్‌ల ఏర్పాటుపై దృష్టి సారించాలని, దీనికి తన వంతు సహకారం అందిస్తానని కుంబ్లే సీఎంకు తెలిపారు. 

క్రీడా సామగ్రి తయారీ ఫ్యాక్టరీలు ప్రస్తుతం జలంధర్, మీరట్‌ లాంటి నగరాల్లో మాత్రమే ఉన్నాయని, అక్కడి నుంచే అన్ని రకాల క్రీడా సామగ్రి సరఫరా జరుగుతుందని కుంబ్లే.. సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఏపీలో ఫ్యాక్టరీ పెడితే అందరికీ అందుబాటులో క్రీడా సామగ్రి ఉంటుందని ఆయన సీఎంకు వివరించారు. టీమిండియాకు టెస్ట్‌ కెప్టెన్‌గా, ప్రధాన బౌలర్‌గా వ్యవహరించిన అనిల్‌ కుంబ్లే.. భారత జట్టు ప్రధాన కోచ్‌ సహా బీసీసీఐలో పలు ఉన్నత పదవులు చేపట్టాడు.


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top