ప్లాంట్‌పై అసెంబ్లీ తీర్మానం చేస్తాం: సీఎం జగన్‌ | CM YS Jagan assurance On Visakha Steel plant for Workers Union | Sakshi
Sakshi News home page

సీఎం స్పందనతో మాకు ఊపిరి: కార్మిక సంఘాలు

Feb 17 2021 4:22 PM | Updated on Feb 17 2021 6:17 PM

CM YS Jagan assurance On Visakha Steel plant for Workers Union - Sakshi

విశాఖపట్టణంలో స్టీల్‌ ప్లాంట్‌కు అనుకూలంగా అసెంబ్లీ తీర్మానం చేస్తామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ప్లాంట్‌ పరిరక్షణ కోసం సీఎం జగన్‌తో కార్మిక సంఘం నాయకులు సమావేశమయ్యారు. భేటీ అనంతరం కార్మిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం హామీతో తమకు ఊపిరి, భరోసా వచ్చిందని పేర్కొన్నారు.

విశాఖపట్టణం: కేంద్రం నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోతే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై అనుకూలంగా బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు గుర్తుచేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై పరిరక్షణ కమిటీ ప్రతినిధులు విశాఖపట్టణంలో బుధవారం సీఎం జగన్‌తో భేటీ అయ్యారు.

సుమారు గంట 20 నిమిషాలు సీఎం జగన్‌ కార్మిక నాయకులతో మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రధానికి రాసిన లేఖతో పాటు విశాఖ ఉక్కు అవసరమైన గనులపై సుదీర్ఘంగా చర్చించారు. గతంలో ఓఎన్ఎండీసీతో గనులతో జరిగిన ఒప్పందంపై పునఃసమీక్ష ఇస్తామని సీఎం చెప్పారు. పొస్కో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు వచ్చే అవకాశాలు ఉండవని స్పష్టం చేశారు. పోస్కో ప్రతినిధులు కలిశారని, కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టమని సూచించినట్లు తెలిపారు. కుదరకపోతే శ్రీకాకుళం జిల్లా భావనపాడు కృష్ణపట్నం పోస్టుల వద్ద ఆ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే పోస్కోకు సహకరిస్తామని కార్మిక నాయకులతో సీఎం జగన్‌ తెలిపారు. దేవుని ఆశీస్సులతో స్టీల్ ప్లాంట్ విషయంపై కేంద్రం ఆలోచనలో మార్పు వస్తుందని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏపీలో ఇనుప ఖనిజం నిల్వలు లేవు, ఉన్నవి చాలా లోగ్రేడ్‌ గనులున్నాయని సీఎం జగన్‌ తెలిపారు. ఒడిశాలో ఈ ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించాలని కోరినట్లు చెప్పారు. రుణాలను ఈక్విటీల రూపంలోకి మారిస్తే వడ్డీల భారం తగ్గుతుందని పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కేంద్ర ప్రభుత్వ సంస్థ, దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు లేవని స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు తాము నిజాయతీగా, చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపారు. పోస్కోవాళ్లు రాష్ట్రానికి రావడం వాస్తవం, నన్ను కలవడం వాస్తవమని, కడప, కృష్ణపట్నం, భావనపాడు చోట్ల ఫ్యాక్టరీ పెట్టమని వారిని కోరినట్లు సీఎం జగన్‌ వివరించారు.

కార్మిక  నాయకుల హర్షం
సమావేశం అనంతరం కార్మిక సంఘ నాయకులు మీడియాతో మాట్లాడారు. గంటకుపైగా కొనసాగిన సమావేశంలో సీఎం జగన్‌ మాటలతో తమకు భరోసా వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ స్పందన ఉద్యమానికి ఊపిరి పోసినట్టు అయ్యిందని పేర్కొన్నారు. ప్రధానికి రాసిన లేఖతోపాటు విశాఖ ఉక్కుకు అవసరమైన గనులపై చర్చించినట్లు వివరించారు. విశాఖ ప్లాంట్‌పై ఇప్పటికే కేంద్రానికి లేఖలో సూచనలు చేసినట్లు తెలిపారు. తమ సమస్యలను సీఎం సానుకూలంగా విన్నారని కార్మిక నేతలు చెప్పారు.

స్టీల్ ఉత్పత్తికి అంతరాయం కలగకుండా ఉద్యమం చేయండి అని తమకు సీఎం సూచించినట్లు కార్మిక నాయకులు వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల్లో స్టీల్ ప్లాంటుకు అనుకూలంగా తీర్మానం చేస్తామని సీఎం చెప్పడం శుభపరిణామని హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌తో సమావేశమైన వారిలో 14 మంది కార్మిక సంఘం నాయకులు మంత్రి రాజశేఖర్, సీహెచ్ నర్సింగ్ రావు, జేవీ సత్యనారాయణమూర్తి, వై.మస్తాన్ అప్ప, గంధం వెంకట్రావు, మురళీరాజు, జె.అయోధ్య రామ్, ఆదినారాయణ, కేఎస్ఎన్ రావు, బి.సురేశ్‌, కె.శ్రీనివాస్, బి.అప్పారావు, బి.పైడ్రాజు, వి.శ్రీనివాస్ ఉన్నారు.

ఉన్నత జీవన ప్రమాణాలు అందివ్వడమే లక్ష్యం : సీఎం జగన్‌

Advertisement
 
Advertisement
Advertisement