అవ్వా.. ఎలా ఉన్నావ్?: సీఎం జగన్ ఆప్యాయ పలకరింపుతో మురిసిపోయిందామె
సాక్షి, వైఎస్సార్: జనంతో మమేకం అయ్యేవాడే నిజమైన లీడర్. అలాంటి లక్షణాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలో పుష్కలంగా ఉన్నాయి. అధికారంలో లేనప్పుడు పాదయాత్ర ద్వారా.. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు సంక్షేమం ద్వారా నిత్యం ప్రజల మధ్యే నిలుస్తుంటాడాయన. సాయం కోసం చూసే ఎదురు చూపులు.. ఎక్కడున్నా ఆయన కంట పడతాయి. ఎందుకంటే.. ప్రజల బాగోగులనే ఎజెండా ఆయన పాలనా ప్రాధాన్యాల్లో అగ్రభాగాన ఉంటుంది కాబట్టి.
తాజాగా.. వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం అధికారిక కార్యక్రమం ముగిశాక ఓ వివాహ రిసెస్షన్కు హాజరయ్యారు సీఎం జగన్. నల్లపురెడ్డి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత బలరామిరెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్లో సందడి చేశారాయన. ఆ వేడుకలో పాల్గొని తిరుగు పయనమైన సందర్భంలో నియోజకవర్గ ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారాయన. ఆ సమయంలో ఆయనతో కరచలనం కోసం అక్కడున్నవాళ్లు ఎగబడ్డారు. ఈ క్రమంలో..
జనాల మధ్య ఉన్న ఓ వృద్ధురాలు.. సీఎం జగన్ను పిలిచారు. అది గమనించిన ఆయన.. తన సిబ్బందికి చెప్పి ఆమెను దగ్గరకు రప్పించుకున్నారు. ఎర్రబెల్లి గ్రామానికి చెందిన వెంకటమ్మప్పగా తనను తాను పరిచయం చేసుకుంది ఆ వృద్ధురాలు. ఆపై ఆప్యాయంగా పలకరించి.. ఆమె బాగోగులు తెలుసుకున్నారు. బోసి నవ్వులతో మురిసిపోతున్న అవ్వను.. సీఎం జగన్ ఆప్యాయంగా కౌగిలించుకోవడం అక్కడున్నవాళ్లను ఆనందానికి గురి చేసింది.