
అంబేడ్కర్ సాక్షిగా జనసేన నాయకుల కుమ్ములాటలు
పిఠాపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇలాకా పిఠాపురంలో నిన్నటి వరకూ టీడీపీ, జనసేన నాయకులే కొట్టుకుంటూ రాగా...తాజాగా జనసేనలోనే రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. పిఠాపురంలో సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు జరిగాయి. పార్టీ తరపున పలు కార్యక్రమాల్లో పిఠాపురం జనసేన ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన వెంట హాజరైన జనసేన నేతల్లో కొందరు రెండు వర్గాలుగా విడిపోయి వివాదానికి తెర లేపారు.
పిఠాపురం పట్టణం ఇందిరా నగర్ రజాలపేటలో ఇరువర్గాలూ వాగ్వాదానికి దిగాయి. ‘పార్టీ పెట్టినప్పటి నుంచీ ఉన్న మేమే అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొంటామని, మీరు వెనకాల రావాలని’ ఓ వర్గాన్ని మరో వర్గం అడ్డగించింది.‘మమ్మల్ని అడ్డుకోడానికి మీరెవరు? మీరు ఎప్పుడు వస్తే మాకేంటి? మేము పార్టీకి పని చేశాం. మేమూ నేతలమే.
మేం వస్తాం, ఎవరడ్డుకుంటారో చూస్తాం’ అంటూ మరో వర్గం తిరగబడింది. దీంతో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు పెరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాలనూ సముదాయించేందుకు కొందరు చేసిన ప్రయత్నాలు చాలాసేపు ఫలించలేదు. ఈ గొడవను కవర్ చేసేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులపై జనసేన నేతలు దురుసుగా ప్రవర్తించారు. దీనిపై మీడియా ప్రతినిధులు తీవ్ర నిరసన తెలిపారు.