ఆశల దీపం ఆరిపోయింది.. | Sakshi
Sakshi News home page

ఆశల దీపం ఆరిపోయింది...

Published Wed, Nov 17 2021 11:14 AM

Boy Drowned in the Gosthani River on Tuesday Dead - Sakshi

పద్మనాభం(భీమిలి): ఆ ఇంటి ఆశల దీపం ఆరిపోయింది. గోస్తని నదిలో గల్లంతైన బాలుడు మంగళవారం శవమై తేలాడు. రేవిడి గ్రామానికి చెందిన మరగడ యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి(9) సోమవారం ఉదయం 5.13 గంటలకు పాండ్రంగి సమీపంలో గోస్తని కాజువే ఒడ్డున స్నానం చేస్తుండగా.. కాలుజారి గల్లంతైన విషయం తెలిసిందే. పాండ్రంగి జాలర్లు, గజ ఈతగాళ్లు సోమవారం నదిలో గాలించినా బాలుడు జాడ కనిపించలేదు. చివరకు 18 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని రంగంలోకి దించి గాలించినా ఆచూకీ లభించలేదు. 

దీంతో కుటుంబ సభ్యులు తెల్లవారంతా ఎదురు చూపులు చూశారు. మంగళవారం వేకువ జామున రేవిడికి చెందిన ఈతగాళ్లు నదిలో గాలించారు. సంఘటన జరిగిన కాజువేకు సుమారు 200 మీటర్ల దూరంలో.. నీలకంఠ రాజు కళ్లానికి సమీపంలో ఉదయం ఆరు గంటల సమయంలో యశ్వంత్‌ కుమార్‌ మృతదేహం నీటిలో తేలుతూ కనిపించింది. బాలుడు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి ఇంటికి తీసుకువెళ్లారు. ఆ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. 

యశ్వంత్‌ చదువుతున్న కృష్ణాపురం స్ప్రింగ్‌ ఫీల్డ్‌ పాఠశాల విద్యార్థులు విషాద వదనంలో మునిగిపోయారు. వెంకటలక్ష్మి, గౌరి రెడ్డిలకు కుమారులు యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి(9), గౌశిక్‌(6), కుమార్తె శరణ్య(3) ఉన్నారు. వీరి పెద్ద కుమారుడు యశ్వంత్‌ కుమార్‌ రెడ్డిని నది రూపంలో మృత్యువు కబళించడంతో.. ఆ తల్లిదండ్రులు గుండె విసేలా రోదిస్తున్నారు. వీరిని ఓదార్చడం ఎవరితరం కాలేదు.

Advertisement
Advertisement