మ‌రోసారి స‌త్తాచాటిన ఏపీ పోలీస్ శాఖ | AP Police Department Has Won 18 Awards At The National Level | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయిలో 18 అవార్డులు సొంతం చేసుకున్న ఏపీ

Oct 29 2020 6:39 PM | Updated on Oct 29 2020 8:16 PM

AP Police Department Has Won 18 Awards At The National Level - Sakshi

సాక్షి, విజయవాడ : ఏపీ పోలీస్ శాఖ 24 గంట‌ల్లోనే మ‌రోసారి జాతీయ స్థాయి అవార్డుల‌లో స‌త్తా చాటింది. గవర్నెన్స్ నేషనల్ పోలీస్ ప్ర‌క‌టించిన 28 జాతీయ అవార్డుల‌కు గాను ఏపీ పోలీస్ శాఖ 18 అవార్డులను సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ -18, మహారాష్ట్ర-2, మధ్య ప్రదేశ్-2, గుజరాత్-2, బీగార్-1, జార్ఖండ్-1, ఛత్తీస్గఢ్-1 తెలంగాణ -1 అవార్డులు ల‌భించాయి.  18 అవార్డులలో పోలీస్ హెడ్‌ క్వార్టర్స్ 7 కైవసం చేసుకోగా, ప్రకాశం 2, అనంతపురం 2, తూర్పుగోదావరి, విజయవాడ సిటీ,  శ్రీకాకుళం, విజయనగరం, కడప,  గుంటూరు రూరల్, కర్నూల్ జిల్లాలకు ఒక్కొక్క అవార్డు వ‌రించింది.

ఈ ఏడాదిలో మొత్తం  103 అవార్డులను దక్కించుకొని దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ  అగ్రస్థానంలో నిలిచింది. దిశ అప్లికేషన్, పోలీస్ సేవా అప్లికేషన్, డిజిటల్ హెల్త్ అప్లికేషన్‌ల‌కు  జాతీయ స్థాయిలో గుర్తింపు ల‌భించింది. దీంతో మరోసారి‌ ఏపీ పోలీస్ శాఖను  ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అభినందించారు. ఏపీ పోలీస్ శాఖ‌కు వ‌రిస్తోన్న  అవార్డులు ఏపీ పోలీస్ పని తీరుకు ప్రామాణికంగా భావిస్తున్నాన‌ని  డిజిపి గౌతమ్ సవాంగ్ అన్నారు. 48 గంటల్లో 72 అవార్డ్ లు రావడం సంతోషంగా ఉంద‌న్నారు. దేశంలోనే ఏపీ పోలీస్ మెరుగైన సేవలు అందిస్తోందనడానికి అవార్డులే నిదర్శనం అని తెలిపారు. (48 స్కోచ్‌ గ్రూపు అవార్డులు దక్కించుకున్న ఏపీ )

పోలీస్‌ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం ​ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. పోలీస్‌ వారోత్సవాల్లో భాగంగా గురువారం విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో ఏపీ పోలీస్ బ్యాండ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఛీఫ్‌ సెక్రెటరీ నీలం సాహ్నీ ముఖ్య అతిథిగా హాజర‌య్యారు. సీఎస్‌కు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్వాగతం ప‌లికారు. పోలీస్ బ్రాస్ బ్యాండ్ ప్రదర్శన ఆహుతులను అల‌రించింది. పోలీస్ బ్యండ్‌లో పైస్ బ్యాండ్ అనేది కొత్త విధాన‌మ‌ని డీజీపీ అన్నారు.

పోలీసులకు రక్షణ మాత్రమే కాకుండా కల్చరల్ అంశాలు కూడా తెలుసున‌ని, ఈరోజు చూపించిన ఏపీ బ్యాండ్ లో చాలా మార్పు వచ్చిందన్నారు.  ఉద్యోగ ధర్మం నిర్వర్తించడంలో త‌మ జీవితాలను అర్పించిన పోలీసులకు ఈ విధంగా నివాళులు అర్పిస్తున్నామ‌న్నారు. ప్రతీ ఒక్కరూ ఆశించిన అంచనాలను చేరేలా బాధ్యతలను నిర్వహించాలని చెప్పారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఏపీ పోలీస్ అద్భుతంగా పనిచేశార‌ని ఆయ‌న కొనియాడారు. బాధ్యతలు నిర్వహించడంలో అసువులు బాసిన వారి కుటుంబాలను కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నామ‌ని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement