చెల్లించాల్సింది రూ.126 కోట్లే

AP Govt Report to High Court arrears of Employment Guarantee Scheme - Sakshi

ఉపాధి హామీ పథకం బకాయిలపై హైకోర్టుకు నివేదన

నాలుగు వారాల్లో చెల్లించాలని ధర్మాసనం ఆదేశం 

సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం కింద గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు సంబంధించి కేవలం రూ.126 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు మంగళవారం నివేదించింది. మిగిలిన మొత్తాలను చెల్లించేశామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్‌ తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ వ్యాజ్యంలో ఇక విచారించేందుకు ఏమీ లేదని, దీన్ని పరిష్కరిస్తామని తెలిపింది. బకాయిలను 12 శాతం వార్షిక వడ్డీతో చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వం చెల్లిస్తోందని ప్రజల డబ్బు అని, ప్రజల డబ్బును కాంట్రాక్టర్లకు పంచడం ఏమిటని ప్రశ్నించింది.

మీరు ఇంట్రస్ట్‌ (వడ్డీ) గురించి మాట్లాడితే.. మేం ఈ వ్యాజ్యాల వెనుక మీకున్న ఇంట్రెస్ట్‌ (ప్రయోజనాలు) ఏమిటన్న దానిపై దృష్టి పెడతామని తేల్చి చెప్పింది. బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఈ వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్టు తెలిపింది. నాలుగు వారాల్లో బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలిత ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధి హామీ పథకం చేసిన పనులకు సరఫరా చేసిన మెటీరియల్‌కు సంబంధించిన బకాయిలను చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top