కొండ కిటకిట
శ్రీవారి దర్శనానికి 40 గంటల వెయిటింగ్
తిరుమల: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లోని కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోవడంతో 3 కి.మీ మేర భక్తులు వేచి ఉన్నారు. నడక మార్గం నుంచి కూడా భక్తులు భారీగా తిరుమలకు వస్తున్నారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు.
నారాయణగిరి ఉద్యానవనం నుంచి ఆళ్వార్ ట్యాంక్ మీదుగా ఏటీసీ, ఎస్ఎంసీ మీదుగా లేపాక్షి సర్కిల్ దాటుకుని, షాపింగ్ కాంప్లెక్స్, పాత అన్నదానం మీదుగా రాంభగీచ, ఆక్టోపస్ బిల్డింగ్ వద్దకు క్యూలైన్ చేరుకుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 నుంచి 6 గంటలు, సర్వదర్శనానికి 40 గంటల సమయం పడుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు భక్తులు హుండీలో రూ.4.27 కోట్లు వేశారు.