
బి.కొత్తకోట (అన్నమయ్య జిల్లా): ఇంటిముందు అరుగు బండ కింద 35 పాములు బయటపడ్డాయి. వీటిని చూసిన గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురై వాటిని చంపేశారు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట సమీపంలోని డేగానిపల్లెలో మంజు ఇంటివద్ద పొడవాటి అరుగు బండ ఉంది.
దాని అడుగు నుంచి ఓ పాము బయటకు రాగా.. గమనించిన గ్రామస్తులు భయంతో చంపేశారు. ఆ తరువాత ఒకదాని వెంట మరొకటిగా పాములు రావడంతో గ్రామస్తులు బండను తొలగించి చూడగా.. మొత్తం 35 పాములు కనిపించడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నివాస గృహాల మధ్య అరుగు బండకింద పాము గుడ్లు పెట్టగా.. వాటి నుంచి పిల్లలు బయటకొచ్చాయి. ఇవన్నీ నాగుపాము జాతికి చెందినవని గ్రామస్తులు తెలిపారు.