అనంతపురం టౌన్: రిజిస్ట్రేషన్ శాఖపై అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల పెత్తనం పెరిగిపోయింది. వారు చెబితేనే రిజిస్ట్రేషన్లు చేయాలి. లేకుంటే సబ్రిజిస్ట్రార్లకు చీవాట్లు, ఛీత్కారాలు లేకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవు. ఉమ్మడి జిల్లాలో 21 సబ్రిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 12, శ్రీసత్యసాయి జిల్లాలో 9 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఇదివరకు సరిగా ఉంటే రిజిస్ట్రేషన్లు జరిగేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరాక పరిస్థితి తారుమారైంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే రిజిస్ట్రేషన్ వ్యవహారాలు సాగుతున్నాయి. తమ అనుమతి లేకుండా ఏ ఒక్క రిజిస్ట్రేషన్నూ చేయవద్దని హుకుం జారీ చేస్తున్నారు. ఒత్తిళ్లు భరించలేక చాలామంది సబ్రిజిస్ట్రార్లు సెలవుపై వెళ్లిపోతున్నారు.
● అనంతపురంలోని రామ్నగర్ ప్రధాన కార్యాలయంలో ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్గా బాధ్యతలు చేపట్టిన ఇస్మాయిల్ ఎక్కువ రోజులు అక్కడ పని చేయలేకపోయారు. ప్రజాప్రతినిధుల ఒత్తిడితో, వారు చెప్పిన పనులు చేయలేక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. వారు చెప్పినవి చేస్తే ఉద్యోగం ఊడిపోతుందనే భయంతోనే చాలామంది ఉద్యోగులు రామ్నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. గడిచిన 8 నెలల కాలంలోనే ఏకంగా ఐదుగురికి పైగా సబ్ రిజిస్ట్రార్లు ఇన్చార్జ్లుగా బాధ్యతలు చేపట్టి.. పని చేయలేక వెళ్లిపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
● కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్గా గతంలో పని చేసిన నారాయణస్వామి స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు ఉంటేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టేవారు. దీంతో స్థానిక ప్రజలు సైతం రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉండేది. ఈ క్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్గానికి చెందిన వ్యక్తులు సబ్ రిజిస్ట్రార్ నారాయణస్వామిని ఏసీబీ అధికారులకు పట్టించారనే ప్రచారం జరుగుతోంది.
● ఆరు నెలల క్రితం బుక్కపట్నం రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేస్తున్న రామ్మోహన్నాయుడు స్థానిక ఎమ్మెల్యే సిఫార్సుతో కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్గా బాధ్యతలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే వర్గానికి చెందిన వ్యక్తుల భూములు, స్థలాలను రిజిస్ట్రేషన్లు చేయడం లేదు. అన్నీ సక్రమంగా ఉన్నా ఎందుకు చేయడం లేదంటూ సబ్ రిజిస్ట్రార్ను నిలదీసినా ప్రయోజనం కనిపించకపోవడంతో జిల్లాలోని ఓ మంత్రిని కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఆయన సిఫార్సుతో మాజీ ఎమ్మెల్యే వర్గీయుల స్థలాలను స్థానిక సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని టీడీపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యేకు చేరవేశారు. దీంతో ఎమ్మెల్యే స్థానిక సబ్రిజిస్ట్రార్ను మందలించినట్లు సమాచారం. దీంతో కలత చెందిన సబ్రిస్ట్రార్ రామ్మోహన్నాయుడు ‘చేస్తే ఒకటి, చేయకపోతే మరోకటా’ అంటూ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయాడు.
మేము చెప్తేనే రిజిస్ట్రేషన్లు చేయాలి
సబ్ రిజిస్ట్రార్లకు ఎమ్మెల్యేల దిశా నిర్దేశం
వారి ఆగడాలు భరించలేక సెలవుపై వెళ్తున్న ఎస్ఆర్లు
మొన్న అనంతపురం.. నేడు కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ లీవుపై..


