● మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి
అనంతపురం న్యూటౌన్: చంద్రబాబు ప్రభుత్వ కుట్రలను దీటుగా తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని ఆయన నివాసంలో ఉరవకొండ నియోజకవర్గ పార్టీ నేతల సమావేశం నిర్వహించారు. విశ్వ మాట్లాడుతూ సీఎం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. టీడీపీ అరాచకాలను ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్తా ప్రతిఘటించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రెడ్ బుక్ పేరుతో మంత్రి లోకేష్ ప్రత్యేక రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనకు, నేటి చంద్రబాబు ప్రభుత్వ పాలనకు మధ్య వ్యత్యాసాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు ఆందోళనకరంగా ఉన్నాయని, వీటిపై పోలీసుల పాత్ర ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటరు సమగ్ర పరిశీలన (సర్) కార్యక్రమంపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. బీఎల్ఏలకు కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుందని, సమస్యలు ఎదురైన వెంటనే అధికారుల దృష్టికి తీసుకుపోవాలన్నారు. కార్యక్రమంలో ఉరవకొండ మండల ఇన్చార్జ్ మూలగిరిపల్లి ఓబన్న, యువజన విభాగం నాయకులు ప్రణయ్ కుమార్ రెడ్డి, కేవీ రమణ, జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, కూడేరు ఎంపీపీ నారాయణరెడ్డి, విడపనకల్లు భీమిరెడ్డి, అన్ని మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


